ఎంపీ పాటిల్ను అభినందించిన మంత్రి
కామారెడ్డి టౌన్, మే 20 : జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ తన సొంత ఖర్చుతో 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను జిల్లా వైద్యశాఖ అధికారులకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చేతుల మీదుగా గురువారం అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా ప్రజల శ్రేయస్సు కోసం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేయడంపై మంత్రి వేముల ఎంపీ పాటిల్ను అభినందించారు. జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఐదు లీటర్ల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని మంత్రి తెలిపారు.
ఎంపీ లాడ్స్ నుంచి 10 అంబులెన్స్లు..
ఎంపీ లాడ్స్ నుంచి 10 అంబులెన్స్లను ఎంపీ పాటిల్ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో అందజేశారు. ఇందులో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి అందజేసిన అంబులెన్స్ను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రారంభించారు. అంబులెన్స్లు ఆధునిక సౌకర్యాలతో ఉన్నాయని, ఒక్కో అంబులెన్స్ విలువ రూ. 16.8 లక్షలు అని ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే జాజాల సురేందర్, కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేతారెడ్డి, జిల్లా వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.