ముంబై : కొవిడ్-19 నుంచి దీటైన రక్షణ పొందేందుకు వ్యాధి నిరోధక శక్తి దీర్ఘకాలం కొనసాగేలా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అవసరమని పలు అభివృద్ధి చెందిన దేశాలు టీకా మూడో డోసును చేపడుతున్నాయి. అభివృద్ది చెందుతున్నదేశాలు, పేద దేశాలు మాత్రం ఇంకా కరోనా టీకా తొలి డోసును కూడా అత్యధిక జనాభాకు ఇవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
మరోవైపు భారత్లో అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కు చెందిన ఆధార్ పూనావాలా మూడో డోసు ఆవశ్యకతపై నిర్ధిష్ట ఆధారాలు లేవని చెప్పడంతో పాటు బూస్టర్ డోస్ అనైతికమని వ్యాఖ్యానించారు. ఇక పూనావాలా తండ్రి ఎస్ఐఐ చీఫ్ సైరస్ పూనావాలా గతంలో టీకా మూడవ డోసు తప్పనిసరిగా తీసుకోవాలని రెండో డోసు తీసుకున్న ఆరు నెలల్లోగా మూడో డోసు తీసుకోవాలని చెప్పడం గమనార్హం.
అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే అతి కొద్దిమందిలో వీటి అవసరం ఉండవచ్చని ఆయన అలా చెప్పి ఉంటారని ఆధార్ పూనావాలా వివరణ ఇచ్చారు. మూడో డోసు ఇవ్వాల్సిన అవసరం ఉందనేందుకు ఆధారాలు లేవని, దీనిపై అధికారికంగా ఎలాంటి సిఫార్సులూ లేవని చెప్పుకొచ్చారు. కాగా వ్యాక్సిన్ సామర్ధ్యం కొద్దికాలానికి తగ్గుముఖం పడుతున్నందున బూస్టర్ డోస్లు ఇవ్వడం అవసరమని ఫైజర్, మోడెర్నా వంటి వ్యాక్సిన్ తయారీ కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇక రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారితో పాటు అవయవ మార్పిడి జరిగిన వారిలో బూస్టర్ డోస్ల అవసరం ఉండవచ్చని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.