Myopia | మన జీవనశైలిలోని అలవాట్లు నేరుగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా పనులు ఆన్లైన్లో చేయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో స్క్రీన్ సమయం ( screen time ) గతంలో కంటే చాలా పెరిగింది. స్క్రీన్ సమయం అనేది కంప్యూటర్, మొబైల్, టీవీ స్క్రీన్ను చూసే సమయాన్ని తెలుపుతుంది. అయితే, పెరిగిన స్క్రీన్ టైమ్ ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ‘ది లాన్సెట్ డిజిటల్ హెల్త్ జర్నల్’లో ప్రచురితమైన అధ్యయనంలో పరిశోధకులు జనానికి పొంచి ఉన్న పెనుముప్పుపై హెచ్చరికలు జారీ చేశారు.
మునుపటి కంటే ఎక్కువ స్క్రీన్ సమయం ( screen time ) పిల్లలు, యువతలో ‘మయోపియా’ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. సకాలంలో నివారణ చర్యలు తీసుకోకపోతే రాబోయే సంవత్సరాల్లో చాలా మంది ప్రజలు ఈ సమస్యతో బాధపడక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇంతకు ముందు మయోపియా ( Myopia ) ప్రమాదం వయస్సు ఉన్న వారిలో ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు స్క్రీన్ సమయం పెరగడంతో ఈ తీవ్రమైన కంటి వ్యాధి చిన్నపిల్లల్లోనూ నిర్ధారణ అవుతున్నట్లు హెచ్చరించారు.
పెరిగిన స్క్రీన్ స్పేస్ ప్రమాదంపై వివరణాత్మకంగా తెలుసుకునేందుకు సింగపూర్, ఆస్ట్రేలియా, చైనా, యూకేలో మయోపియాపై ఆరోగ్య నిపుణులు అధ్యయనం నిర్వహించారు. మూడు నెలల నుంచి 33 సంవత్సరాల పిల్లలు, యువకుల కళ్లను పరీక్షించారు. అధ్యయనంలో పాల్గొన్న చాలా మంది వ్యక్తుల స్క్రీన్ సమయం బాగా పెరిగినట్లు తేలింది. అధ్యయనం ఫలితాలను విశ్లేషించగా పరిశోధకులు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. స్మార్ట్ డివైజెస్ స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల మయోపియా ప్రమాదం 30శాతం పెరిగినట్లు తేలింది. దీంతో పాటు కంప్యూటర్లను అధికంగా వినియోగించడం కారణంగా ఈ ప్రమాదం 80శాతానికి పెరిగింది.
కంటి వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మయోపియా (సమీప దృష్టి) సమస్యతో రోగి తన దగ్గర ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలుగుతారు. అయితే, దూరంగా ఉన్న వస్తువులను సరిగ్గా చూడలేరు. వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి. ఇందులో కంటి ఆకృతి మారుతుంది. కంటి రక్షణ బయటి పొర అయిన కార్నియా విస్తరణ కారణంగా ఈ సమస్య వస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ఈ స్థితిలో కంటిలోకి ప్రవేశించే కాంతిని సరిగా ఫోకస్ చేయలేదు.
కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో పిల్లలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించారు. ఇందుకు స్మార్ట్ఫోన్, ట్యాబ్ తదితర స్మార్ట్ డివైజెస్ వినియోగించినట్లు పరిశోధకులు అధ్యయనం సమయంలో గుర్తించారు. ఎక్కువ సమయం స్మార్ట్ డివైజెస్ స్ర్కీన్పై గడిపే అలవాటు పిల్లలతో పాటు యువకుల్లో పెరిగిందని, ఫలితంగా మయోపియా ప్రమాదాన్ని పెంచుతున్నట్లు పేర్కొన్నారు. 2050 సంవత్సరం నాటికి, ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి మయోపియా ప్రమాదం పొంచి ఉందని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ (ARU)లోని విజన్ అండ్ ఐ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో ఆప్తాల్మాలజీ ప్రొఫెసర్ బౌర్న్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ బౌర్న్ ప్రకారం.. చాలా కాలంగా పిల్లలు ఆన్లైన్ తరగతులకు హాజరుకావాల్సి వచ్చింది. పాఠశాల మూసివేత యువకులు సైతం ఇంటి నుంచే పని చేయాల్సి పరిస్థితి ఎదురైంది. డిజిటల్ పరికాల ద్వారా వెలువడే నీలి కాంతి మన కళ్లపై ప్రభావం చూపుతుందని తెలిపారు. మయోపియాతో పాటు ఇతర కంటి సమస్యలను పెంచుతుందని అధ్యయనాలు గుర్తించాయని పేర్కొన్నారు. ‘ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి పెరుగుతున్న మయోపియా కేసులను చూస్తే.. ఖచ్చితంగా తీవ్రమైన సమస్య వైపు వెళ్తున్నాం.. ఈ వేగాన్ని తగ్గించడం చాలా ముఖ్యం’ అని అభిప్రాయపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Data Stealing : ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ యాప్లతో జాగ్రత్త.. వీటితో వచ్చే సమస్యలు ఇవి!
WhatsApp : ఇక నుంచి వాట్సప్ చాట్ బ్యాకప్స్ భద్రం.. ఇలా సెట్ చేసుకోండి
Facebook : ఆ ఫేస్బుక్ అకౌంట్, టూల్ను బ్యాన్ చేసిన ఫేస్బుక్.. కారణం ఏంటి?
Six Pack : సిక్స్ ప్యాక్ బాడీ అందరికీ సాధ్యం కాదా? జీన్స్తో సంబంధముంటుందా?