అవును, అవసరం లేకున్నా మనం మందుల్ని మింగుతుంటే ఏదో ఓ దశలో మనల్నే అవి మింగేస్తాయి. కరోనాకన్నా కరోనా భయమే ప్రజల్లో ఎక్కువైపోయింది. దీంతో, ముందు జాగ్రత్త పేరుతో రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. ఒక తుమ్ముకో, రెండు దగ్గులకో ఆగమాగమైపోయి సొంత వైద్యానికి సిద్ధపడుతున్నారు. రోగ నిరోధక శక్తి పేరుతో మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ యథేచ్చగా వాడేస్తున్నారు. గూగుల్ గురూజీలు, యూ ట్యూబ్ సలహా రామన్నల మిడిమిడి జ్ఞానానికి దాసోహమంటున్నారు. అయితే, మందులను జాగ్రత్తగా వాడితే ఎంత ప్రయోజనకరమో, అజాగ్రత్తగా వాడితే అంతే ప్రమాదకరం. అవసరం లేనప్పుడు వాడటం వల్ల, అవసరమైనప్పుడు వాడినాకూడా శరీర వ్యవస్థలు వాటిని తిరస్కరించే ఆస్కారం ఉంది.
‘అందరి’ కోసం కాదు
ఇంట్లో ఒకరికి కరోనా నిర్ధారణ అయితే, రోగితోపాటు ఇంటిల్లిపాదీ అవే యాంటిబయాటిక్స్, విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. అదే విధంగా ఒక రోగికి ఇచ్చిన మందుల ప్రిస్క్రిప్షన్ను కుటుంబమంతా అనుసరించడమూ అశాస్త్రీయమే. ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది. రోగిలోని వ్యాధి లక్షణాల ఆధారంగా డాక్టర్ మందులను సిఫారసు చేస్తారు. వాట్సాప్ మెసేజ్ల ఆధారంగానో, యూ ట్యూబ్ వీడియోలను నమ్మడం వల్లో ఇలా జరుగుతున్నది. కనుక, ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యుల సిఫారసు లేకుండా యాంటీబయాటెక్స్, స్టెరాయిడ్స్ తీసుకోవద్దు. దీనివల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. భవిష్యత్లో షుగర్, బీపీ, ఊబకాయం తదితర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
యాంటీ ‘భయా’టిక్సే..
ఎలాంటి రోగ లక్షణాలూ లేకున్నా కేవలం కరోనా భయంతో యాంటీ బయాటిక్స్ వాడటం వల్ల ఏ ఉపయోగం ఉండదు. అది ప్రమాదకరం కూడా. ఈ కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. భవిష్యత్లో ఏదైనా వ్యాధి వస్తే తట్టుకునే శక్తినీ కోల్పోతారు. ప్రాణాంతక పరిస్థితుల్లో డాక్టర్లు యాంటిబయాటిక్స్ ఇచ్చినా సమర్థంగా పనిచేయవు. అప్పటికే శరీరంలో మోతాదుకు మించి వాటి అవశేషాలు ఉండటం వల్ల వైరస్కూడా వాటికి అలవాటు పడిపోతుంది. అంతిమంగా, ప్రాణాలకే ముప్పు వస్తుంది.
స్టెరాయిడ్స్ జోలికి పోవద్దు!
వైసలాన్, మెడ్రాల్, డెఫ్లోకాట్ వంటి స్టెరాయిడ్స్ను విచ్చలవిడిగా వాడుతున్నారు. వాస్తవానికి వీటిని కొవిడ్ రోగులు, అదీ ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి. కొవిడ్ సోకిన తర్వాత కూడా సాధారణ లక్షణాలుంటే స్టెరాయిడ్స్ అవసరం లేదు. పరిస్థితి తీవ్రమయ్యే సందర్భంలోనే నిపుణులు సిఫారసు చేస్తారు. కొన్ని సందర్భాల్లో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల, రోగ నిరోధక శక్తి తగ్గి పరిస్థితి తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకినప్పుడు లేదా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు, సీఆర్పీ మార్కర్స్ పెరుగుతున్నప్పుడు మాత్రమే స్టెరాయిడ్స్ ఇస్తారు. అదికూడా చాలా తక్కువ సమయం ఇవ్వాలి. కొంతమంది, ఏకంగా ఆరు వారాలపాటు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు. ఇది మంచి పరిణామం కాదు. వీటి దుష్ర్పభావం వల్ల ఎముకలు బలహీనపడి షుగర్, బరువూ పెరుగుతారు. ఏ మందులనూ అవసరానికి మించి వాడకూడదు. ఎక్కువగా వాడితో ఎక్కువ శక్తి వస్తుందనో, వ్యాధి త్వరగా తగ్గిపోతుందనో అనుకోవడం అజ్ఞానం. దీనివల్ల ఇతర సమస్యలుకూడా వస్తాయి. శరీరానికి, ఆ వ్యాధికి తగ్గట్టు డాక్టర్ సూచన మేరకే మందులను తగిన మోతాదులోనే ఉపయోగించాలి. డోసేజీ పెరిగితే శరీరంలో హార్మోన్ల పని తీరు దెబ్బ తింటుంది. కొత్త వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.
ఆ రోగులు జాగ్రత్త
బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు సంబంధిత ట్యాబ్లెట్స్ను కచ్చితంగా వాడాలి. అదే సమయంలో, కొవిడ్ ముందు జాగ్రత్త పేరుతో ఏ ఇతర యాంటిబయాటిక్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ తీసుకోవద్దు. అలా చేయడం వల్ల అప్పటికే ఉన్న వ్యాధి మరింత ముదిరే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులున్న రోగులు కరోనా లక్షణాలు కనిపిస్తే, డాక్టర్ సలహా మేరకు మాత్రమే ట్యాబ్లెట్స్ వాడాలి.
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా, ప్రాణాపాయం ఉండకపోవచ్చు. అలాంటివారు కూడా ‘ఎందుకైనా మంచిది’ అన్న కారణంతో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్, విటమిన్లు, స్టెరాయిడ్స్ను ఉపయోగించవద్దు. వీటి వల్ల వ్యాక్సిన్ ప్రభావం తగ్గిపోయే ప్రమాదం ఉంది.
సహజ సిద్ధంగా…
రోగ నిరోధ శక్తిని పెంచుకోవడానికి మందులకంటే, సహజ సిద్ధమైన పద్ధతులే ఉత్తమం. నిత్యం పోషకాహారం ఎంత అవసరమో తగినంత శారీరక శ్రమా అంతే అవసరం. క్రమం తప్పని వ్యాయామం మేలు చేస్తుంది. ఉదయం ఎండ మంచిది. రోజూ కనీసం 3-4 లీటర్ల నీళ్లు తాగాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా తినాలి.
డాక్టర్ కె. శశికిరణ్
సీనియర్ జనరల్
ఫిజీషియన్,
యశోద హాస్పిటల్స్