అహ్మదాబాద్ : పుట్టిన రెండు రోజులకే ఓ చిన్నారి కరోనా మహమ్మారి బారినపడింది. 14 రోజుల పాటు చికిత్స పొందుతూ హాస్పిటల్లో కన్ను మూసింది. ఈ విషాదకర ఘటన గుజరాత్లోని సూరత్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సూరత్కు చెందిన మహిళ ఇటీవల డెలివరీ అవగా.. ఆడ శిశువు జన్మించింది. బిడ్డ పుట్టిన రెండు రోజుల తర్వాత కరోనా సోకినట్లు గుర్తించారు. ప్లాస్మా ఇచ్చినా వైద్యులు శిశువును కాపాడలేకపోయారు. అయితే, శిశువు తల్లికి కరోనా లక్షణాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పలేదు. పైగా బిడ్డ పుట్టిన తర్వాత పాలు పట్టించింది. దీంతో బిడ్డ ఆరోగ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపింది.
వెంటనే చిన్నారిని చికిత్స కోసం సూరత్ వరచాలోని డైమండ్ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం నవజాత శిశువు మరణించింది. కరోనా మహమ్మారి రెండో దశలో పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఇప్పటికే సూరత్లో వైరస్ ప్రభావంతో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. సూరత్లోని న్యూ సివిల్ హాస్పిటల్లో రెండు రోజుల కింద కరోనాతో నవజాత శిశువు మరణించింది. అభం శుభం తెలియని చిన్నారులు మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతుండడంతో తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని కలిగిస్తోంది.