“ప్రజా రవాణాలో భాగంగా ఔటర్ రింగు రోడ్డు చుట్టూ రైల్వే వలయం ఏర్పాటుకు కార్యాచరణ జరుగుతోంది. నగర శివార్లు, గ్రామాలను కలుపుకొని 158 కిలో మీటర్లున్న ‘ఔటర్’ చుట్టూరా ప్రజా రవాణా వ్యవస్థకు సరికొత్త రైల్వే రింగ్లైన్ నిర్మాణమే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) చెబుతోంది. వేగంగా విస్తరిస్తున్న నగరంలో 2041 నాటికి రవాణా, కాలుష్యపూరక సమస్యలు లేని నగరంగా ఉండాలంటే.. నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ వంటివి ఎంతో కీలకమని రవాణ వ్యవస్థ నిఫుణులు చెబుతున్నారు.. ఆ దిశగా రైల్వే రింగుకు అడుగులు పడుతున్నాయి.”
హైదరాబాద్ మహా నగరం చుట్టూ రింగు రోడ్లే కాదు.. రైల్వే రిం గు లైన్ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. మహా నగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రో డ్డు చుట్టూనే కొత్తగా రైల్వే రింగు లైన్ నిర్మించడం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉంటుందని హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) అధ్యయనంలో తేలింది. నలుమూలలా శరవేగంగా విస్తరిస్తున్న మహా నగరంలో 2041 నాటికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండాలంటే, ప్రజా రవాణా వ్యవస్థ లో కీలకమైన బస్సు, ఎంఎంటీఎస్, మెట్రో, బీఆర్టీఎస్, ఎల్ఆర్టీఎస్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, సైక్లింగ్ (నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్టు) వంటివి ఎంతో కీలకమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగానే హైదరాబాద్ మహానగర దశ, దిశను నిర్దేశించేలా ఉన్న 158 కి.మీ ఔటర్ రింగు రోడ్డు చుట్టూ రైల్వే రింగు లైన్ను ఏర్పా టు చేయడం ద్వారా మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని సూచించారు. ఇప్పటికే ఐటీ కారిడార్లోని రాయిదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి మెట్రో లైన్ను ఓఆర్ఆర్ వెంబడి శంషాబాద్ వరకు 31 కి.మీ మేర నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అదే విధంగా భవిష్యత్తులో మిగతా ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే లైన్ను (మల్టీ మోడల్ ట్రాన్స్ఫోర్ట్ సిస్టం – ఎం ఎంటీఎస్) ఏర్పాటు చేస్తే కాలుష్య రహితంగా ఉండట మే కాకుండా ఎంతో తక్కువ ధరలో నగరవాసులు నిత్యం రాకపోకలు సాగించేందుకు అవకాశం కలుగుతుందని అర్బన్ ట్రాన్స్పోర్టు నిపుణులు సిఫారసులు చేశారు.
మహా నగరంలో రైల్వే నెట్వర్క్ ఎంతో విస్తృత్తంగా ఉం ది. నగరంలోని సికింద్రాబాద్, హైదరాబాద్(నాంపల్లి), కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి దేశంలోని పలు మెట్రో నగరాలకు, చిన్న పట్టణాలకు రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. నగరం నలుమూలలా రైలు మార్గాలు ఓఆర్ఆర్ మీదుగా వెళ్తున్నాయి. వీటిలో ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రైలు మార్గం ఘట్కేసర్ వద్ద, సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్లే రైలు మార్గం మేడ్చల్ వద్ద, లింగంపల్లి నుంచి వికారాబాద్ వెళ్లే రైలు మార్గం తెల్లాపూర్-ఊదుల నాగులపల్లి వద్ద, హైదరాబాద్ -బెంగళూరు వెళ్లే రైలు మార్గం శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ల మీదుగానే ఉన్నాయి. అంటే ఓఆర్ఆర్కు రైల్వే మార్గం ఉన్నట్లే. ఇక ఔటర్ చుట్టూ ఉన్న ప్రాంతాల కు రైల్వే నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకురావాలంటే ఓఆర్ఆర్ లోపల రైల్వే లైన్ కోసం సేకరించిన స్థలంలో రైల్వే రింగు లైన్ను నిర్మిస్తే ప్రజా రవాణా వ్యవస్థ ఎంతో మెరుగవుతుందని ఉమ్టా అధ్యయనం చేసింది.
హైదరాబాద్ మెట్రో పాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) భవిష్యత్తులో హైదరాబాద్ మహానగరం విస్తరించే ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్ జిల్లాతో సహా చుట్టూ ఉన్న రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లోని ప్రాంతాలను కలి పి హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఏర్పాటు చేసి ప్రణాళిక బద్ధమైన పట్టణీకరణకు శ్రీకారం చుట్టారు. దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్-2031ను రూపొందించి అమలు చేస్తున్నారు. ఇందులో కాలనీలు, రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పన భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, మెట్రో పాలిటన్ ఏరియా పరిధిలో ప్రజా రవాణాకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకంగా హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా)ను ఏర్పాటు చేశారు. 2041 నాటికి హెచ్ఎంఏ పరిధిలో అవసరమైన ప్రజా రవాణా వ్యవస్థ ఎలా ఉండాలి? ఏవిధంగా ఉండాలి? ఎక్కడెక్కడ ఏది ఉండాలన్న దానిపై ఎప్పటికప్పుడు సమగ్రంగా అధ్యయం చేసి ప్రభుత్వం ముందు ఉంచుతోంది. ఒక నగరం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలంటే ఎలాంటి అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వాలనే దానిపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.
ఔటర్ రింగు రోడ్డు చుట్టూ రైల్వే రింగు లైన్ను నిర్మిస్తే శివారు ప్రాంతాలు మరింత వేగంగా విస్తరిస్తాయనే అభిప్రాయాన్ని పట్టణ ప్రణాళిక నిఫుణులు వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన మౌలిక వసతులు ఉంటే ఒక ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అదే తరహాలో ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు రోడ్డు రవాణ మార్గంగా ఔటర్ ఎంతో దోహదం చేస్తోంది. అదే విధంగా రైల్వే రింగు లైన్ను నిర్మిస్తే మరింత మెరుగైన మౌలిక సదుపాయం అందుబాటులోకి వస్తుంది. తద్వారా, నగరంలో ఎక్కడ ఉంటున్నా, రోడ్డు మార్గంలోనే కాకుండా రైల్వే మార్గంలో శివారు ప్రాంతాలకు చేరుకోవడం సులభమవుతుందనే అభిప్రాయాన్ని నిఫుణులు వ్యక్తం చేస్తున్నారు. గత జనవరిలోనే హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) 2041 నాటికి రవాణా నెట్ వర్క్ ఎలా ఉండాలనే దానిపై పలు సిపారసులు చేసి ప్రభుత్వానికి అందజేసింది.