బ్రజిలియా : కరోనా కట్టడిలో వ్యాక్సినేషన్ కీలక ఆయుధమని స్పష్టమైంది. అమెరికా తర్వాత కరోనాతో విలవిలలాడిన బ్రెజిల్ అనుభవంతో ఈ విషయం తేటతెల్లమైంది. సెరెనా పట్టణంలోని జనాభాలో పెద్దలందరికీ దాదాపు 45,000 మందికి ప్రయోగాత్మకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ద్వారా అద్భుత ఫలితాలు వచ్చాయి. డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ వినియోగం పొందిన చైనా వ్యాక్సిన్ కరోనావ్యాక్ ను ఇక్కడి ప్రజలకు ఇచ్చారు. వైరస్ వ్యాప్తిలో తగ్గుదల ద్వారా వ్యాక్సిన్ డోసులు తీసుకోని వారికి కూడా రక్షణ లభించినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య వ్యాక్సినేషన్ ప్రయోగం చేపట్టారు.
ఇందులో భాగంగా పట్టణంలో 18 ఏండ్లు పైబడిన వారిలో 75 శాతం మందికి పైగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. మొత్తం జనాభాకు వ్యాక్సిన్ వేయకుండానే మహమ్మారిని అదుపులో పెట్టవచ్చని ఈ ఫలితాలు వెల్లడించాయని రీసెర్చి డైరెక్టర్ రికార్డో పాలసియోస్ పేర్కొన్నారు. పెద్దల్లో 95 శాతం మందికి వ్యాక్సినేషన్ చేపట్టడం ద్వారా మరణాల సంఖ్య 95 శాతం తగ్గినట్టు వెల్లడైందని చెప్పారు. కరోనా రోగులు దవాఖానాల్లో చేరడం 86 శాతం తగ్గగా, వ్యాక్సిన్ తీసుకోని 20 ఏండ్లలోపు వారిలో కొవిడ్-19 కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని వివరించారు. స్కూల్స్ తిరిగి తెరిచేందుకు పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సిన అవసరం లేదని ఈ ఫలితాలు తెలిపాయని చెప్పారు.