ముంబై : కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందన్న అంచనాల మధ్య ముంబై నగరంలో నిర్వహించిన కీలక సెరో సర్వే ఆసక్తికర వివరాలు వెల్లడించింది. 51 శాతానికి పైగా చిన్నారుల్లో ఇప్పటికే యాంటీ బాడీలు అభివృద్ధి చెందినట్టు బీఎంసీ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ముంబైలో సగానికి పైగా చిన్నారులకు ఇప్పటికే కొవిడ్-19 సోకిందని ఈ సర్వేలో స్పష్టమైంది.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 15 మధ్య సెరో సర్వే చేపట్టారు. సర్వేలో 1 నుంచి 18 ఏండ్ల మధ్య వయస్కుల్లో సెరో పాజిటివిటీ రేటు 51.18 శాతంగా నమోదైంది. 10-14 ఏండ్ల చిన్నారుల్లో సెరో పాజిటివిటీ రేటు అత్యధికంగా 53.43 శాతం నమోదైంది. ముంబైలోని 24 వార్డుల్లో పలు లేబొరేటరీల నుంచి సేకరించిన 2176 రక్త నమూనాలను పరీక్షించగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇక నగరవ్యాప్తంగా సెరో పాజిటివిటీ రేటు 51.18 శాతంగా నమోదైందని బీఎంసీ వర్గాలు వెల్లడించాయి.