పల్లెల్లో బతకలేక, పట్టణాలకు వలస వచ్చిన వారు, గుంటెడు భూమి ఉంటే చాలు బిందాస్గా బతుకుతామని మళ్లీ ఊరుకు వాపస్ పోతున్నారంటే,
ఆ ధీమా కేసీఆర్ ఇచ్చిందే. ఆయన రైతు కంటనీరు తుడువాలనుకున్నారు. వ్యవసాయ సంక్షోభాన్ని శాశ్వతంగా పరిష్కరించాలనుకున్నారు.
కొన్ని సమస్యలు పాలకులకు చిత్తశుద్ధి, సమర్థత ఉంటే సులభంగా పరిష్కరించగలిగేవి. మరికొన్ని మౌలిక పరిష్కారం అవసరమయ్యేవి. మూలాలకు వెళ్ళి విశ్లేషించి, ఒక వ్యవసాయ- ఆర్థిక వేత్తగా, పరిపాలకునిగా అహోరాత్రులు తర్కించి తర్కించి పరిష్కారం సాధించవలసినవి ఇంకొన్ని.
కేసీఆర్కు చిత్తశుద్ధి ఉన్నది, దృఢ నిశ్చయం ఉన్నది. రైతుల మీద అపారమైన ప్రేమ ఉన్నది. కనుకనే తెలంగాణకు పచ్చల హారం తొడిగారు. భారతావనిలో చివరి ఆయకట్టుకు నీళ్లు.. చిట్టచివరి గింజ కొనుగోలు అనే లక్ష్యాన్ని సాధించిన ఒకేఒక్క నాయకుడు కేసీఆర్. వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపిస్తున్న ఏకైక పాలకుడు కేసీఆర్.
కేసీఆర్ చేపట్టిన రైతు బంధు పథకం ఒక సక్సెస్ స్టోరీ.. ఆదర్శప్రాయం.. – ఐరాస వ్యవసాయ విభాగం
రైతుబంధు పథకం భారత భవిష్యత్ వ్యవసాయ విధానంగా మారేంతటి శక్తిమంతమైనది. – అరవింద్ సుబ్రమణ్యన్, సుప్రసిద్ధ ఆర్థిక వేత్త
అనంత కాల గమనంలో ఏడేళ్లు అతి స్వల్పం. ఒక ప్రాంతపు ప్రస్థానంలో, ఒక రాష్ట్రపు అస్తిత్వంలో, ఒక ప్రభుత్వ పాలనలో, ఒక నాయకుడి చరిత్రలో ఏడేళ్లు ఎంత? దశాబ్దాలుగా దయనీయంగా ఉండిపోయిన ఒక రంగాన్ని ఉద్ధరించడానికి ఏడేళ్లు ఏ మూలకు? కానీ జనహితమనే సంకల్పంతో, మేధోమథనమనే దీక్షతో, మనో వేదికపై తపస్సు చేసి, కార్యక్షేత్రంలో కష్టపడితే ఏడేళ్లలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. విప్లవాలు వికసిస్తాయి! అశ్రుధారలు కారిన కళ్లనుండే ఆనంద బాష్పాలు రాలుతాయి. కూలిన బతుకుల్లోంచే కొత్త జీవితాలు ఉదయిస్తాయి. బీడువారిన పొలాల్లోనే పచ్చల హారాలు ప్రసరిస్తాయి. అందుకు నిదర్శనం నేటి తెలంగాణ సాగు పత్రం, రైతు చిత్రం! నెర్రెలిచ్చి ఎర్రబారిన తెలంగాణ నేలకు జీవ జలాన్ని పంచి, జవ జీవాలను పెంచిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్. తన జనంపై, తన జలంపై, తన జన్మభూమిపై మనసు నిండా ప్రేమ నిండిన కేసీఆర్ కన్న కలలకు సజీవ తార్కాణం నేటి తెలంగాణ!
ఒక్కసారి ఏడేళ్లు వెనక్కుపోతే విషాద దృశ్యం, విచార చిత్రం కనిపిస్తాయి. కళతప్పిన చెరువులు, కోతల కరెంటు, నీళ్లందని చేలు, పడావు భూములు, ఎండిన బోర్లు, కాలిన మోటార్లు! చేనులో నాగలి కట్టి, మొగులు దిక్కు మోరపెట్టి దిక్కులు చూసే దిక్కుతోచని స్థితి. అప్పులే పెట్టుబడై, కన్నీళ్లే దిగుబడై రైతన్న దేహం కళ్లంలో తుమ్మచెట్టుకు వేలాడిన దుస్థితి. ఎకరా 10- 20 వేలకు తెగ నమ్ముకున్న పరిస్థితి. రైతు బిడ్డంటే పిల్లనివ్వని కాలమది! ఎన్ని ఆత్మహత్యలు! ఎన్ని కుటుంబాలు అన్యాయమైపోయాయి? మహారాష్ట్ర తర్వాత ఇక్కడే ఆత్మహత్యలు ఎక్కువని జాతీయ పత్రికలో పరిశోధనాత్మక కథనాలు. చట్టసభల్లో సుదీర్ఘ చర్చలు, ఎవరిది తప్పని రచ్చలు. అవే తప్ప రైతన్న పరిస్థితి ఎవరికైనా పట్టిందా? ఏ నాయకుడి మనసైనా కరిగిందా? గుండె చెరువైందని గులిగిన వారే తప్ప చెరువును బాగు చేసిన వాడొక్కడైనా ఉన్నాడా?
అట్లాంటి తెలంగాణ, అట్లాంటి తెలంగాణ వ్యవసాయం ఏడేళ్లలో ఎంత మారింది? ఎలా మారింది? ఎవరి వల్ల మారింది? అందుకు కారకుడు,ప్రేరకుడు కేసీఆర్. కర్త, ధర్త కేసీఆర్!
2012లో కేసీఆర్..
సస్యశ్యామల తెలంగాణను నిర్మిద్దాం. అందుకు జలవనరుల పరంగా అద్భుతమైన ప్రణాళికను రూపొందించుకుందాం. నీటి పారుదల రంగ నిపుణుల మేధస్సుతో ప్రాజెక్టుల రూపకల్పన జరిగేలా చూద్దాం. దీంతో తెలంగాణలో అదనంగా లక్షలాది ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. తెలంగాణ అంతా పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలం అవుతుంది.
తెలంగాణ రాకముందు 2012 జూన్ 6న సాగునీటి నిపుణులతో కేసీఆర్
2021లో ముఖ్యమంత్రి కేసీఆర్..
నూతన తెలంగాణ రాష్ట్రంలో ఆరునూరైనా వ్యవసాయరంగాన్ని పునర్జీవింపచేసి, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే సిద్ధాంతంతో, వ్యవసాయరంగాన్ని స్థిరీకరించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. మిషన్ కాకతీయతోపాటు, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించాం. రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని గుణాత్మకంగా మార్చివేశాం. తెలంగాణ రైతుకు నేడు వ్యవసాయం మీద ధీమా పెరిగింది. అంకితభావంతో, రైతు సంక్షేమం వ్యవసాయాభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో, తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టడంవల్లనే అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోగలిగాం.
2021, మే 29న వ్యవసాయరంగ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
తన ప్రాంతాన్ని, ప్రజలను ప్రేమించిన వారే అసాధ్యాలను సుసాధ్యం చేయగలుగుతారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. తెలంగాణ నేలపై, చేలపై, తెలంగాణ ప్రజలపై, ప్రగతిపై కేసీఆర్కు ఉన్న అంచంచలమైన ప్రేమే సాగిలా బాగయ్యేందుకు కారణం. ఏడేళ్లలో తెలంగాణలో జరిగిన దాన్ని నిశితంగా పరిశీలిస్తే, దాన్నొక అగ్రి డాక్ట్రిన్గా పేర్కొనవచ్చు. రోల్మాడల్గా చూపించవచ్చు. దశాబ్దాల మథనంతో ఒక హైపోథీసీస్ను తయారు చేసుకుని, తెలంగాణ ల్యాబ్లో దానిపై ప్రయోగం చేసి నిరూపించిన శాస్త్రీయ సత్యం… తెలంగాణ అగ్రి- కల్చర్! రైతే రాజని నినాదాలిచ్చిన వారున్నారు. హరిత విప్లవాలంటూ ప్రచారం చేసినవారున్నారు. కానీ నేడు రైతును నిజంగా రాజును చేసింది కేసీఆర్. వ్యవసాయ విప్లవాన్ని మించింది తెలంగాణ వ్యవసాయ విజయం.
గాలొచ్చినప్పుడే తూర్పార బట్టాలె అన్నట్టు, తెలంగాణ రాగానే కేసీఆర్ వ్యవసాయ రంగంపై దృష్టిపెట్టారు. సాగును అభివృద్ధి చేయడంలో కేసీఆర్ ఆలోచన, నిర్దిష్టమైన ప్రణాళిక, క్రమబద్ధమైన కార్యాచరణ కనిపిస్తుంది. పంట భూమిపై రైతుకు హక్కును ఖరారు చేయడం మొదలుకుని, పండిన పంటను పల్లెకే వెళ్లి ప్రభుత్వమే కొనేదాకా అంతా పద్ధతి ప్రకారం. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటు. ఆ కరెంటుకు కొరతరాకుండా స్థాపిత విద్యుత్తు సామర్థ్యం పెంపు. కరెంటిచ్చినా బోర్లలో నీళ్లుంటే కదా నడిచేది? అందుకే భూగర్భ జలాలను పెంచేందుకు చెరువులు, చెక్డ్యామ్ల నిర్మాణం! వానలు పడకపోతే చెరువుల్లోకి నీళ్లెలా రావాలి? అందుకోసం పెండింగ్ ప్రాజెక్టుల సత్వర పూర్తి! దాంతో పాటే 20 ప్రాజెక్టులకు సరి సమానమైన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలో నిర్మాణం! నీళ్లొస్తే చాలా? సాగుపై సలహాలిచ్చేందుకు వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం. దాంతో పాటే రైతు సమితుల ఏర్పాటు, రైతులు మంచీ చెడ్డా మాట్లాడుకోవడానికి రైతు వేదికల నిర్మాణం. రైతన్నను నిలువునా ముంచేస్తున్న కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం. కూలీలు దొరకని కాలంలో వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహం. పెట్టుబడి కోసం ఎకరాకు పదివేల చొప్పున రైతు బంధు సాయం. రోడ్లపై పంటలు ఆరబోసుకుని ప్రమాదాల బారిన పడకుండా పంట కళ్లాల నిర్మాణం. దాని భారం పడకుండా ఉపాధి హామీతో అనుసంధానం. వ్యవసాయానికి అనుబంధంగా చేపలు, గొర్ల పెంపకం పథకాలు. చివరికి, చిట్టచివరికి ఇంటి పెద్ద చనిపోతే, రైతు కుటుంబం ఆగమై బజార్ల పడొద్దనే పెద్ద మనసుతో గుంటెడు భూమి ఉన్న రైతుకైనా 5 లక్షల జీవిత బీమా! ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఎరువులను పోలీసు స్టేషన్లలో పెట్టి అమ్మేవారు. కొట్లాటలు అవుతాయని. వందలాది రైతులు తమ చెప్పుల్ని క్యూలో పెట్టి, ఎరువుల కోసం ఎదురుచూసే వారు. మరి ఇప్పుడు? ఎక్కడైనా ఎరువుల కొరత ఉందా? నిజానికి ఉమ్మడి రాష్ర్టానికి, ఇప్పటికి పోలిస్తే తెలంగాణలో సాగు విస్తీర్ణం దాదాపు రెట్టింపైంది. రెండు పంటల్లో కలిపి రెండు కోట్ల ఎకరాల్లో సాగు అవుతున్నది. గతంలో 11 లక్షల టన్నుల ఎరువులు అవసరమైతే ఇప్పుడది రెట్టింపుకన్నా పెరిగి 25.5 లక్షల టన్నులకు చేరింది. కానీ ఎక్కడ పంచాయతీ లేదు. విత్తనాలుంటేనే పెత్తనాలు అంటారు. ఇప్పుడు తెలంగాణలో విత్తన కొరత లేదు. కల్తీ మాట లేదు. కొట్లాట లేదు. పోలీసు లేడు. క్యూ లేదు! ఈ పరిస్థితి వస్తదని ఎప్పుడైనా అనుకున్నమా! ఇక ఈ కరోనా కాలంలో, కూలీ హమాలీ, డ్రైవరూ, క్లీనరూ బయటికి రావడానికే జంకుతున్న కాలంలో, ప్రతి ఊరికీ వెళ్లి ప్రతి గింజా కొనే ఏర్పాటు చేయడం ఒక పరిపాలనా అద్భుతం.
దేశంలో ఒక రంగంపై, ఒక్క వ్యవసాయ రంగంపై, ఇంత స్వల్పకాలంలో, ఇన్ని నిర్ణయాలు, ఇన్ని చర్యలు, ఇంతగా ప్రభుత్వ ప్రోత్సాహం ఇచ్చిన రాష్ట్రంగానీ, నాయకుడుగానీ మరొకరు ఉన్నారా? ఏడేళ్లు కాదు; 70 ఏళ్లు తీసుకోండి. ఎవరైనా చేశారా? ఎక్కడో దేవీలాల్, చరణ్సింగ్ అనే రైతు నాయకులు ఉన్నారని విన్నం. ఎందరో సీఎంలు, పీఎంలు రైతు కుటుంబాల నుంచి వచ్చినవారేనని అనుకున్నం. అయినా రైతుల సమస్యలు తీరలేదు. వ్యవసాయం సంక్షోభం నుంచి బయటపడలేదు. వ్యవసాయం దండుగ అన్న ముఖ్యమంత్రులను చూసిన ఈ నేల నేడు కేసీఆర్ పుణ్యమా అని వ్యవసాయాన్ని పండుగ చేసింది. ఈ దేశంలో రైతన్న కోసం కేసీఆర్ చేసినన్ని పనులు మరెవరూ చేయలేదు. ఇండియాలోగానీ, సౌతిండియాలోగానీ రైతుకోసం ఇలాంటి చర్యలు చేపట్టిన ప్రభుత్వం మరొకటి ఉన్నదా అంటే ఘంటాపథంగా లేదని చెప్పవచ్చు. గతంలో తెలంగాణ వ్యథ కన్నవారికి, ఇప్పటి విజయగాథ వింటున్న వారికి ఎవరికైనా మనసులోంచి వచ్చే మాట అసలైన రైతు నాయకుడు కేసీఆర్. అసలైన రైతు బాంధవుడు కేసీఆర్!
‘కాలం బాగైతెనే మా దుకాణానికి ఎవరైనా వస్తారు. పంటలు పండక పోతే గిరాకీ ఉండదు’ ఇదీ సిద్దిపేటలోని ఒక దుకాణదారు అభిప్రాయం. ఒక సామాన్య దుకాణదారే కాదు, ఆర్థిక రంగ స్థితిగతుల అంచనా కూడా రుతుపవనాలు, పంటల అంచనాల మీదే రూపొందుతాయి. స్టాక్మార్కెట్ సూచీలైనా వ్యవసాయ ఫలసాయం అందనిదే పైకి కదలవు. రైతు స్థిమితంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటది. రైతు ప్రశాంతంగా ఉంటేనే దేశం ప్రశాంతంగా ఉంటుంది. రైతన్న కొలువుండే పల్లె బాగుంటేనే పట్నం బాగుంటది. వ్యవసాయంపై కేసీఆర్ తాత్వికతకు ఇదే మూల సూత్రం. అందుకే తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ ఆయన ఊరు బాగు కోసమే పరితపించారు. అందుకోసమే రైతు సమస్యలను పరిష్కరించారు. రైతు పథకాలను ఆవిష్కరించారు. ప్రాంతంపై ప్రజలపై ఉండే ఆయన ప్రేమే వ్యవసాయరంగాన్ని వైఫల్యం నుంచి విజయం వైపు పరివర్తన చెందించింది. రైతు కోసం ఆయన మనసులో తడి ఉంది కనుకే, పొలం తడిసింది. ఇప్పుడు తెలంగాణలో రైతు ఉద్యమాల చిత్రాల్లేవు. ఉద్యమ స్ఫూర్తితో రైతులు కదులుతున్న దృశ్యం ఉంది. ఊర్లలో పోలీసుల పద ఘట్టనల్లేవు. ట్రాక్టర్లు, ధాన్యపు లారీలు తిరిగే శబ్దాలు తప్ప! ఇప్పుడు తెలంగాణలో రైతులు సామూహిక శక్తి!!
పల్లెల్లో బతకలేక, పట్టణాలకు వలస వచ్చిన వారు, గుంటెడు భూమి ఉంటే చాలు బిందాస్గా బతుకుతామని మళ్లీ ఊరుకు వాపస్ పోతున్నారంటే, అదీ కేసీఆర్ సాధించింది. ఆయన రైతు కంటనీరు తుడువాలనుకున్నారు. వ్యవసాయ సంక్షోభాన్ని శాశ్వతంగా పరిష్కరించాలనుకున్నారు. కొన్ని సమస్యలు పాలకులకు చిత్తశుద్ధి, సమర్థత ఉంటే సులభంగా పరిష్కరించగలిగేవి. మరికొన్ని మౌలిక పరిష్కారం అవసరమయ్యేవి. సమస్య మూలాలకు వెళ్ళి విశ్లేషించి, ఒక వ్యవసాయ- ఆర్థిక వేత్తగా, పరిపాలకునిగా అహోరాత్రులు తర్కించి తర్కించి పరిష్కారం సాధించవలసినవి ఇంకొన్ని. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంది, దృఢ నిశ్చయం ఉన్నది. దుక్కి ఉంటేనే దిక్కు అన్న నమ్మకం ఉన్నది. కనుకనే తెలంగాణకు పచ్చల హారం తొడిగారు. భారతావనిలో చివరి ఆయకట్టుకు నీళ్లు.. చిట్టచివరి గింజ కొనుగోలు అనే లక్ష్యాన్ని సాధించిన ఒకేఒక్క నాయకుడు కేసీఆర్. వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపిస్తున్న ఏకైక పాలకుడు కేసీఆర్.
చెప్పింది చేసి చూపించే వాడే పరిపాలకుడు ఆ పరిపాలకుడు మన కేసీఆర్ – కృష్ణస్వామి, 8096677001
తనిసిరే వేల్పులు ధది రత్నముల చేత?
వెరిచిరే ఘోర కాకోల విషము చేత?
విడిచిరే యత్నమమృతంబు వొడయుదనుక?
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు!
క్షీరసాగర మథనంలో రత్నాలు దొరికినాయి కదా అని సంబురపడి ఆగిపోలేదు దేవతలు. హాలాహలం పెల్లుబికితే భయపడి పారిపోలేదు. అమృతం వస్తుందో లేదో అని అనుమానపడి మధ్యలోనే వదలిపెట్టలేదు. దృఢ నిశ్చయంతో సాగరాన్ని మధించి అమృతం సాధించారు. పట్టుదల కలిగిన వారెప్పుడూ పనిని సగంలో వదలివేయరు!
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం ద్వారా రైతులకు ప్రతి సీజన్కు ఎకరానికి 4 వేల రూపాయల (ప్రస్తుతం ఇది ఐదు వేలు) పెట్టుబడి సాయం చేస్తున్నారు. ఏ పంట పండిస్తున్నా, మార్కెట్ ధరలు ఎలా ఉన్నప్పటికీ రైతు ఖాతాల్లోకే నేరుగా సబ్సిడీని అందిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అనుసరిస్తున్న రైతుబంధు పథకం లాగా రైతులకు స్థిరమైన ఆదాయం సమకూర్చే పెట్టుబడి విధానంపై అన్ని పార్టీలూ దృష్టిపెట్టాలి.
అశోక్ గులాటీ, ఆగ్రో ఎకానమిస్ట్
పైసా లంచం లేకుండా..
అరక అరిగితే గరిసె విరుగుతుందని సామెత. రెండు పంటల పచ్చటి తెలంగాణలో రైతన్న ముచ్చటగా మూడో పంటకు సిద్ధమవుతున్నడంటే, దానివెనక కేసీఆర్ దశాబ్దాల ఆలోచన ఉంది. మీ పంటకు పెట్టుబడి నాది, మీ దిగుబడి కొనే పూచీ నాది అని కేసీఆర్ ఇచ్చిన భరోసా ఉంది. అందుకే రైతు సమస్యలపై దీక్షలంటూ ఊర్లకు వెళుతున్న విపక్షాల నేతలను రైతులే తరిమికొడుతున్నరంటే వారు కేసీఆర్ను ఎంతగా నమ్ముతున్నరో అర్థమవుతున్నది.
రైతు బంధు గురించి ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కరోనా కాలంలో, ఖజానాలన్నీ వట్టిబోయిన సమయంలో రైతు బంధు రాదంటూ టీవీలు, పత్రికలు, సోషల్ మీడియా దుష్ప్రచారం మొదలు పెట్టాయి. కానీ కేసీఆర్ రైతు బంధు షెడ్యూలు ప్రకటించడం ద్వారా వాటికి జవాబిచ్చారు. ఇంత కష్టకాలంలోనూ నిర్ణీత సమయంలో, సీజన్కు ముందే, పెట్టుబడి సాయం అందిస్తుండడం విశేషం. పాలకుడు సమర్థుడైతే, నిర్ణయాలు గట్టిగా ఉంటే, మనం గమనించకుండానే కొన్ని మంచి పనులు జరిగిపోతుంటాయి. రైతు బంధులోనూ అదే జరిగింది. గతంలో ప్రతి ఊరిలోనూ ఐదారుగురు పైరవీకార్లో, దళారులో ఉండేవాళ్లు. ప్రభుత్వ సాయం ఏదైనా అందాలంటే వారిని ఆశ్రయించాల్సిందే. పైసలు ఇచ్చుకోవాల్సిందే. ఇక గిర్దావర్లకు, ఎమ్మార్వోలకు చదివింపులు వేరే సంగతి. చెప్పులరిగేలా తిరిగినా పైసలు చేతిలో పడేదాకా అనుమానమే.
ఇప్పుడు రైతు బంధు కింద ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలను పంచుతున్నది. గతంలోనైతే 1500 కోట్లు పంచితే అందులో హీనపక్షం 150 కోట్లయినా పక్కదారి పట్టేవి. ఒక్కొక్క దళారీ కనీసం వెయ్యి, రెండువేలు తినేవాడు. కానీ ఇప్పుడు 15 పైసలు కూడా లంచం ఇవ్వాల్సిన పని లేదు. ఏ పైరవీకారుతోనూ పన్లేదు. ఎమ్మార్వోకు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. పని చెడి తిరిగే పన్లేదు. ఎవర్నీ గోకేది లేదు, గీకేది లేదు. మీ ఫోనులో మెసేజ్ గంట మూడు సార్లు మోగిందంటే రైతు బంధు పైసలు మీ ఖాతాలో ఉన్నట్టే లెక్క, ఆర్థిక, వ్యవసాయ శాఖల నుంచి, బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చిందంటే పైసలు జమైనట్టే లెక్క. ఇలాంటిదొకటి సాధ్యమైతదని మనమెప్పుడైనా ఊహించినమా?
ఈ దెబ్బకు ఊర్లో దళార్లు మటుమాయమయ్యారు. మాకు దక్కే 150 కోట్లు రాకుండా చేసి మా నోట్లో కేసీఆర్ మట్టి కొట్టాడని లంచగొండి అధికారులు, పైరవీకార్లు కేసీఆర్ను తిట్టుకుంటున్నారంటే అందులో ఆశ్చర్యం ఏముంది?
ధరణి అంత అద్భుతం..
భూరికార్డుల జోలికి పోతే చేయికాల్చుకున్నట్టే అని ఎమ్మార్వో మొదలుకుని, ఐఏఎస్లదాకా కేసీఆర్ను భయపెట్టారట. అయినా కేసీఆర్ పట్టు వీడలేదు. అంతేకాదు; రెవెన్యూ రికార్డును, రిజిస్ట్రేషన్ రికార్డును ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు పాస్బుక్కు ఉంటే తప్ప ఎవరి వ్యవసాయ భూమినీ ఎవరూ అమ్మలేరు. ఒకరి భూమిని మరొకరికి రాయడం అనేది కలలో కూడా జరగదు. రిజిస్ట్రేషన్ యంత్రాంగాన్ని విస్తరించడంతో 5-10 నిముషాల్లో క్రయ విక్రయాలు పూర్తవుతున్నాయి. యూరప్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా తన భూమి రికార్డులు చూసుకోవచ్చు. ఇదెప్పుడైనా మనం ఊహించామా?
కేసీఆర్ సృష్టించిన మరో అద్భుతం ధరణి. ప్రపంచంలో భూమి కోసం పడిచచ్చే వాళ్లు ఇద్దరే ఇద్దరు. ఒకరు కిసాన్, మరొకరు జవాన్! ఇది నా భూమి అనుకోవడంలోనే రైతు గౌరవం, శ్రమ, శక్తి ఇమిడి ఉన్నాయి. ఊర్లలో కొట్లాటలకు ప్రధాన కారణం భూ తగాదాలు. భూ రికార్డులు పకడ్బందీగా లేకపోవడమే సమస్యకు మూలకారణమని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చెప్పారు. గతంలో కేంద్రం ఒకసారి భూ భారత్ పేరుతో రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టి, చేయలేక బోర్లబొక్కల పడింది. దేశంలో మరే రాష్ట్రమైనా, ఏ నాయకుడైనా భూ రికార్డుల జోలికి వెళ్లాలంటేనే భయపడతారు. అలాంటి సాహసాన్ని కేసీఆర్ చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి గురించి ఆలోచించారు. భూమిపై రైతుకు పూర్తి హక్కు కల్పించడమే సమస్యకు పరిష్కారమని నిశ్చయానికి వచ్చారు. ఇప్పుడు ధరణి 99 శాతం సఫలమైంది. ధరణిని సక్సెస్ చేయడానికి కేసీఆర్ వీఆర్వోలు మొదలుకొని రెవెన్యూ నిపుణులదాకా అందరితోనూ అనేకసార్లు మాట్లాడారట. ఈ కసరత్తు పూర్తి కావడానికి దాదాపు మూడేళ్లు పట్టిందట. ధరణికి అదనంగా, రైతుకు దన్నుగా చేపడుతున్న మరో అద్భుత కార్యక్రమం భూముల సర్వే. అంటే సర్వే నంబర్లను అక్షాంశ రేఖాంశాలతో అనుసంధానం చేయడమనే కేసీఆర్ లక్ష్యం పూర్తయితే, ఇక భూగోళం ఉన్నంతవరకు ఎవరూ మార్చలేరు. రైతన్నను ఏమార్చలేరు. పోడు భూములు అంటేనే గిరిజనులకు, అటవీ అధికారులకు మధ్య ఘర్షణకు మరోపేరు. అలాంటి పోడు భూములకు కూడా రైతు బంధు ఇస్తూ గిరిజనుల సమస్యను తానే వచ్చి పరిష్కరిస్తానని ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.
సమస్య పీడిస్తుంటే, ముక్కుతూ మూల్గుతూ కాలం గడపడం చాలా మంది నాయకులకు అలవాటు. కానీ కేసీఆర్ సమస్యను పసిగట్టి ఎదురెళ్ళి ఢీకొంటారు.ఎంత ధైర్యం, ఎంత నిబద్ధత ఉంటే తప్ప కేసీఆర్ ఆ మాట చెప్పగలరు.
‘రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. పరిపాలకుడు రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడు. రాజకీయ నాయకుడు తమ పార్టీ విజయాన్నే చూస్తాడు. పరిపాలకుడు తమ దేశ సంక్షేమాన్ని చూస్తాడు. రాజకీయ నాయకుడు వాలును బట్టి పోవాలనుకుంటాడు.పరిపాలకుడు దిశను మార్చాలనుకుంటాడు.
జేమ్స్ ఫ్రీమన్ క్లార్క్ రచయిత, తత్వవేత్త
పూచిన తంగేడు వేస్తిరా, కాచిన కానుగు వేస్తిరా నేను పండేందుకు అన్నదట పంట!
దానికెవరు చెప్పాలి.. ఇదంతా కేసీఆర్ ఆలోచనా వ్యూహం పోసిన పోషక శక్తి అని!