No Tobacco Day | ఏదో సరదాకి.. ఒక్కసారి అంటూ మొదలైన ధూమపానం వ్యసనంగా మారి ఎందరో బలి అవుతున్నారు. అది ప్రమాదకరమని తెలిసినా చాలామంది ఆ అలవాటు నుంచి బయటపడలేక ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ ప్రాణాంతకమైన పొగాకును నియంత్రించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987లో నిర్ణయించింది. మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవాలని 1988లో పిలుపునిచ్చింది. అప్పట్నుంచి పొగాకు నియంత్రణ కోసం ప్రచారాలు చేస్తూనే ఉంది.. ఎంతోమంది వైద్యనిపుణులు కూడా అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయినా సరే పొగాకు వినియోగం తగ్గకపోగా.. రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ధూమపానం కారణంగా ఎంతోమంది క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం నో టొబాకో డేను పురస్కరించుకుని సికింద్రాబాద్ కార్ఖానాలోని రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ & చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్, డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ చెప్పిన పలు సూచనలు, సలహాలు మీకోసం..
ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకేందుకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ.. 90 శాతం కేసులకు ప్రధాన కారణం మాత్రం సిగరెట్ తాగడమే. భారత్లో దాదాపు 267 మిలియన్ల జనాభా ఉంటే వారిలో దాదాపు 2.70 కోట్ల మంది నిత్యం పొగాకును వినియోగిస్తున్నారు. దేశ జనాభాలో 15 ఏళ్లకు పైబడ్డ వారు 28.6 % మంది ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందులో పురుషులు 42.4 %, మహిళలు 14.2 % మంది ఉన్నట్లు రిపోర్టులు సూచిస్తున్నాయి. ఇక.. మన రాష్ట్రం విషయానికొస్తే.. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో క్యాన్సర్ భారం 12.5 శాతం పెరిగే అవకాశం ఉందని తాజాగా చేసిన పరిశోధనలో వెల్లడైంది. తెలంగాణ రాష్ట్ర క్యాన్సర్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం, ICMR, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ (NCDIR) విడుదల చేసిన రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం వినియోగమవుతున్న పొగాకు ట్రెండ్ ఆధారంగా 2020లో 47,620 కేసులు నమోదవ్వగా అవి 2025 నాటికి 53,565కు పెరుగుతాయని అంచనా వేసింది.
ఒక్క సిగరెట్లో దాదాపు 600 పదార్థాలు ఉంటాయి. దాన్ని కాల్చినప్పుడు 7 వేలకు పైగా రసాయనాలను సృష్టిస్తాయి. వాటిలో కనీసం 69 రసాయనాలు క్యాన్సర్కు కారణం అవుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందుకే ధూమపానానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. సిగరెట్ మానేసిన వెంటనే చిరాకు, కోపం, మలబద్ధకం, మగత నిద్ర వంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ అవి తాత్కాలికమే. ధూమపానం మానేయడంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా మెరుగైన జీవితం గడపవచ్చు. ధూమపానం అలవాటు మానేయడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గడమే కాదు.. మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. పొగ తాగడం మానేసిన వారిలో రక్తనాళాలు చురుగ్గా పనిచేస్తాయి. గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ధూమపానం మానేస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మానసికంగా బలంగా మారతారు. జీవితంపై నమ్మకం పెరుగుతుంది. తద్వారా కుటుంబ, సంసార బంధాలు బలపడతాయి. ధూమపానం అలవాటు మానేస్తే దాదాపు 20 నిమిషాల్లోనే రక్తపోటు, గుండె కొట్టుకోవడం వంటివి సాధారణ స్థితిలోకి వస్తాయి.
* 128 గంటల్లోపు రక్త ప్రసరణ సాధారణ స్థితికి వచ్చేస్తుంది.
* 24 గంటల్లో నికోటిన్ శరీరం నుంచి వైదొలుగుతుంది.
* 48 గంటల్లో వాసన, రుచి చూడటం మెరుగవుతుంది.
* 78 గంటల్లో శ్వాసక్రియ బాగా అభివృద్ది చెందుతుంది.
* 9 నెలలలోపు దగ్గు 10 శాతం తగ్గిపోతుంది.
* 12 నెలల లోపు గుండె జబ్బుల ప్రమాదం 50 శాతం తగ్గిపోతుంది.
* 10 సంవత్సరాలలోపు ఊపిరితిత్తుల క్యాన్సర్ 50 శాతం తగ్గిపోతుంది.