వారణాసి : కరోనా మహమ్మారి మూడో వేవ్తో విరుచుకుపడుతుందని వైరాలజిస్టులు, పరిశోధకుల అంచనాలకు భిన్నంగా మూడు నెలల వరకూ మూడో వేవ్ తలెత్తబోదని బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్యూ) జువాలజీ విభాగంలో సీనియర్ జన్యుశాస్త్రవేత్త ప్రొఫెసర్ జ్ణానేశ్వర్ చౌబే పేర్కొన్నారు. మూడు నెలల వరకూ థర్డ్ వేవ్ దేశాన్ని తాకే పరిస్థితి లేదని ఆయన పలు అధ్యయనాల అంచనాలకు భిన్నంగా చెప్పుకొచ్చారు.
దేశంలో ఇప్పుడు కరోనా టీకాలు అందుబాటులోకి వచ్చాయని, పాజిటివిటీ రేటు 3 నుంచి 8 శాతం పెరగడంతో పాటు 10 నుంచి 12 శాతం తగ్గడం మనం చూశామని చౌబే పేర్కొన్నారు. తమ అంచనాల ప్రకారం మరో మూడు నెలల వరకూ థర్డ్ వేవ్ తలెత్తే అవకాశాలు లేవని అన్నారు. దేశంలో 70 నుంచి 75 శాతం మందిలో నెలకొన్న యాంటీబాడీలు మరో మూడు నెలలు నిలిచిఉండే పరిస్ధితి ఉందని వ్యాఖ్యానించారు.
టీకాలు తీసుకున్న వారిలో థర్డ్ వేవ్ తీవ్రత, మరణాలు తక్కువగా ఉంటాయని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు, చిన్నారులపైనా థర్డ్ వేవ్ పెను ప్రభావం చూపబోదని చౌబే పేర్కొన్నారు. నవంబర్ నాటికి మనం 90-95 శాతం ప్రజలకు టీకా ఇవ్వగలిగితే థర్డ్ వేవ్ వ్యాప్తి చెందినా అధిక ప్రభావం ఉంటుందని తాను అనుకోవడం లేదని అన్నారు.
నవంబర్ గణాంకాలు విశ్లేషించిన మీదట తదుపరి మూడు నెలల్లో వైరస్ ప్రభావంపై తిరిగి మదింపు చేస్తామని చెప్పారు. కరోనా టీకా తీసుకున్న వారు, కొవిడ్-19 నుంచి కోలుకున్న వారు వైరస్ నుంచి రక్షణ పొందే విభాగం కిందకు వస్తారని అన్నారు. ఏమైనా మూడో వేవ్ అంటూ వస్తే అది మరో మూడు నెలల తర్వాతేనని చౌబే చెప్పుకొచ్చారు.