జక్రాన్పల్లి, మే 12 : కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందిన హృదయవిదారక సంఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ శివారులో బుధవారం చోటు చేసుకున్నది. జక్రాన్పల్లి ఎస్సై సాయారెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మోర్తాడ్ గ్రామానికి చెందిన క్రాంతీష్(30) అనారోగ్యానికి గురయ్యాడు. కొవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో నిజామాబాద్ జిల్లా మాధవనగర్ శివారులో గల ఓ ప్రైవేటు కొవిడ్ సెంటర్లో చికిత్స నిమిత్తం చేర్పించారు. చికిత్స పొందుతూ క్రాంతీష్ బుధవారం మృతి చెందాడు. అంబులెన్స్లో క్రాంతీష్ మృతదేహాన్ని భార్య సరిత, తండ్రి బాబన్న స్వగ్రామమైన మోర్తాడ్కు తీసుకొని వస్తుండగా అర్గుల్ శివారులో జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్రాంతీష్ తండ్రి బాబన్న(60)కు బలమైన గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సరిత, అంబులెన్స్ సిబ్బంది ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సాయారెడ్డి తెలిపారు. ఒకేరోజు తండ్రి కొడుకులు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.