న్యూఢిల్లీ : తమ సిబ్బంది అందరికీ తక్షణమే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టని పక్షంలో పనులు నిలిపివేస్తామని ఎయిర్ ఇండియా పైలట్ల సంఘం హెచ్చరించింది. సంస్థకు చెందిన 18 ఏండ్లకు పైబడిన విమాన సిబ్బందికి వ్యాక్సిన్ వేసేందుకు వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించని పక్షంలో తాము పనిని ఆపేస్తామని భారత వాణిజ్య పైలట్ల సంఘం (ఐసీపీఏ) తేల్చిచెప్పింది. కేంద్ర పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఐసీపీఏ లేఖ రాసింది. కొవిడ్-19కు ముందున్న వేతనాలను తమకు పునరుద్ధరించాలని ఈ లేఖలో మంత్రిని కోరింది.
గతంలో మంత్రి హామీ ఇచ్చినా వేతన కోతలపై ఎయిర్ ఇండియా యాజమాన్యం పైలట్ల పట్ల కటువుగా వ్యవహరిస్తోందని వాపోయింది. కరోనా మహమ్మారి సాకుతో పైలట్ల వేతనాలను ఎయిర్ ఇండియా 55 శాతం తగ్గించిందని డిసెంబర్ లో ఐదు శాతం మేరకు తిరిగి జోడించినా కరోనాకు ముందున్న వేతనాలతో పోలిస్తే పైలట్ల వేతనాలు 50 శాతం తక్కువగా ఉన్నాయని గుర్తుచేసింది. వేతన సమస్యతో పాటు తమకు కొవిడ్-19 ముప్పు అధికంగా ఉన్నందున తక్షణమే దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా పైలట్ల కోసం వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఐసీపీఏ కోరింది.