న్యూఢిల్లీ : కరోనా వైరస్ చికిత్సలో ఇప్పటికే పలు ఔషధాలను వాడుతుండగా తాజాగా టేప్ వార్మ్ ఇన్ఫెక్షన్ చికిత్సలో ఉపయోగించే నిక్లోసమైడ్ కరోనాపైనా ప్రభావవంతంగా పనిచేస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) పేర్కొంది. ఈ డ్రగ్ కొవిడ్ చికిత్సలో ఉపయోగించవచ్చని ఆర్ఐఎల్ వార్షిక నివేదికలో పేర్కొంది. ఇటలీలోని ట్రిస్టీలో యూనివర్సిటీ ఆస్పత్రిలో పరిశోధకులు నిర్వహించిన అథ్యయనంలో నిక్లోసమైడ్ సార్స్-కోవ్-2 చికిత్సలో సమర్ధవంతంగా పనిచేసినట్టు గుర్తించారు.
కొవిడ్-19పై ఈ ఔషధం ఎలా పోరాడుతుందో ఆ అథ్యయనంలో పరిశోధకులు వెల్లడించారు. 2004లో సార్స్ రోగుల చికిత్సలోనూ ఇదే మందును వాడారు. కొవిడ్-19 చికిత్సలో నిక్లోసమైడ్ పై రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. మరోవైపు తక్కువ ధరకు లభించే టెస్టింగ్ కిట్స్ పైనా ఆర్ఐఎల్ కసరత్తు సాగిస్తోంది. ఆర్ఐఎల్ రూపొందించిన ఆర్ గ్రీన్, ఆర్ గ్రీన్ ప్రొ కిట్లకు భారత్ లో అనుమతి లభించింది. మార్కెట్ ధరలో ఐదో వంతు ధరకే శానిటైజర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్ఐఎల్ కసరత్తు చేస్తోంది.