నారాయణరావుపేట /గజ్వేల్ రూరల్, మార్చి 24: రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం, కాళేశ్వరం జలాలను కూడవెల్లి వాగులోకి వదిలారు. నీటి విడుదలతో పక్కనే ఉన్న కొడకండ్ల చెక్డ్యాం నిండి పొంగిపొర్లుతున్నది. రెండో రోజూ కాళేశ్వరం జలాలు మండల పరిధిలోని బూరుగుపల్లి చెక్డ్యాం వరకు చేరుకోవడంతో వాగు నీళ్లతో జలకళను సంతరించుకున్నది. ఈ నీటితో కూడవెల్లి వాగుపైన నిర్మించిన 34 చెక్డ్యాంలు నిండనున్నాయి. వందలాది ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన వరిపైరుకు ప్రయోజనం చేకూరనున్నది. రెండు, మూడు రోజుల్లో కాళేశ్వరం నీళ్లు కూడవెల్లి వాగులోకి పూర్తి స్థాయిలోకి చేరుతాయి.
రంగనాయకసాగర్ ఎడమ కాల్వ నీటి విడుదలతో..
రంగనాయకసాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తుండడంతో నారాయణరావుపేట పెద్దచెరువు మత్తడి దూకుతున్నది. దీంతో పాటు కోదండరావుపల్లి, బంజేరుపల్లి చెరువులు నిండనుండడంతో రైతులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా ఇటీవల రాఘవాపూర్ చెరువు నిండుకున్నది. రంగనాయకసాగర్తో చెరువులు, కుంటలు నిండుతుండడంతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు ఎం పీపీ ఒగ్గు బాలకృష్ణ, జడ్పీటీసీ లక్ష్మీరాఘవారెడ్డి, వైస్ ఎంపీపీ సంతోష్ కుమార్, మండలాధ్యక్షుడు కిషన్ రైతులు పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నారు.