వయసు పెరిగేకొద్దీ శరీరంలో ఇబ్బందులు తలెత్తడం సర్వసాధారణం. దేశంలో 60 సంవత్సరాలు పైబడిన వారి సంఖ్య పెరిగే కొద్దీ, డిమెన్షియాతో బాధపడే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. డిమెన్షియా పెరగడానికి ప్రధాన కారణం అల్జీమర్స్ వ్యాధి.
వృద్ధులలో, న్యూరాలజీ క్లినిక్లకు వచ్చే రోగులలో ఎక్కువగా జ్ఞాపకశక్తిలో ఏర్పడే అసమతుల్యతల కారణంగానే వస్తున్నారు. ఈ అసమతుల్యతల కారణంగా వారు తరచుగా జరిగే విషయాలను, సంఘటనలను మరచిపోతుండటం, గణాంకాలను సరిగ్గా చేయలేకపోవడం (ముఖ్యంగా డబ్బుల లెక్కింపులో ఇబ్బందులు), దారులు మరచిపోవడం వంటి వాటిని ఎక్కువగా గమనించవచ్చు.
వ్యాధి లక్షణాలు
అయితే, అల్జీమర్స్ వ్యాధి ముదరడానికి దీర్ఘకాలం పట్టినా, అలాంటివారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం కచ్చితంగా ఏర్పడుతుంది. ఎందుకంటే రోజువారీ పనుల కోసం కూడా ఇతరులపై ఆధారపడే పరిస్థితి తలెత్తుతుంది. అంతేకాకుండా, అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన ఇతర లక్షణాలను పరిశీలిస్తే ఇంటికి, ఆఫీసుకు చేరుకోవాల్సిన దారులు మరచిపోవడం లేదా దారి తప్పిపోవడం జరుగుతుంది. ఇలాంటివారిని తెలిసినవారు గుర్తించి పలు సందర్భాలలో ఇంటికి చేరవేయడం చూస్తుంటాం.
అంతేకాకుండా, వీరు తాము చేసిన పనులను వెంటనే మరిచిపోవడం… అంటే, అల్పాహారంగా ఏం తీసుకొన్నారో గుర్తులేకపోవడం, ఇంట్లో కుటుంబీకులతోపాటు టెలిఫోన్లలో ఏం మాట్లాడారో, ఎవరితో మాట్లాడారో గుర్తులేకపోవడం జరుగుతుంది. కానీ, వారి గత స్మృతులు మాత్రం గట్టిగానే ఉంటాయి. ఈ రోగులు తమ పుట్టినరోజు, పెళ్లిరోజు, తాము చదువుకున్న స్కూలు వంటివాటిని బాగానే గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే వారి గతస్మృతులు చెరిగిపోకుండా ఉంటాయి కాబట్టి. కానీ, ఇటీవల జరిగిన సంఘటనలను మాత్రం మరచిపోతుంటారు. సాధారణంగా ఇలాంటి రోగులను వైద్యుల వద్దకు తీసుకొని రావడానికి కుటుంబసభ్యులు ఆలస్యం చేస్తుంటారు. దీనికి వారి దృష్టిలో రోగికి ఎలాంటి ఇబ్బందులు లేవని భావించమే కారణం. అందుకే, ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స అందించగలిగితే సమస్య తీవ్రత తగ్గుతుంది. తద్వారా కుటుంబసభ్యులపై భారం తగ్గడమే కాకుండా, వారు తగిన జాగ్రత్తలు తీసుకొంటూ రోగులను సంరక్షించుకోగలుగుతారు. దాంతో జ్ఞాపకశక్తిలో అసమతుల్యతల కారణంగా రోగులు ఇబ్బందులు పడకుండా చూసుకోవడానికి వీలవుతుంది.
వ్యాధి కారణాలు
ఇక అల్జీమర్స్ వ్యాధి రావడానికి ప్రధానంగా పెరుగుతున్న వయసు, మహిళలలో ఎక్కువగా చక్కెర వ్యాధి (డయాబెటీస్), హైపర్ టెన్షన్, కుటుంబంలో ఇలాంటి వ్యాధి ఉన్న చరిత్ర, సరైన విద్య లేకపోవడం, ఎక్కువ కొలెస్ట్రాల్ స్థాయులు ఉండడం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. ఇలాంటి పలు కారణాలను మన జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. రక్తపోటు, డయాబెటీస్, కొలెస్ట్రాల్ వంటి వాటిని నియంత్రణలో ఉంచుకోవడం ఇందులో ప్రధానమైనది.
జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అల్జీమర్స్లో ప్రధానంగా కనిపించే ఇబ్బందైనా, దీని కారణంగా మన రోజువారీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది ప్రధానంగా వ్యాధి తీవ్రత పెరిగేకొద్ది రోగి మెదడుపై ప్రభావం చూపడం ప్రారంభించడంతో.. రానురానూ రోగి కుటుంబసభ్యులు లేదా ఇతరుల సహాయంపై ఆధారపడిపోవడం జరుగుతుంది.
వ్యాధి నిర్ధారణ
ఇక అల్జీమర్స్ వ్యాధిని నిర్ధారించడానికి రోగి క్లినికల్ హిస్టరీ ..అంటే వైద్య చరిత్ర, జ్ఞాపకశక్తి పరీక్షలు, న్యూరో ఇమేజింగ్ వంటి (అనగా, మెదడు యొక్క సిటి స్కాన్ లేదా యంఆర్ఐ స్కాన్) పరీక్షలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా తరచుగా న్యూరో సైకలాజికల్ పరీక్ష చేయడం ద్వారా వ్యాధి తీవ్రతను అంచనా వేయవచ్చు. ఈ పరీక్షా ఫలితాలలో గుర్తించే లక్షణాల వలన వ్యాధి ఎలా ముందుకు సాగుతుందో అర్థమవుతుంది. ఈ పరీక్షలలో సర్వసాధారణంగా చేసే పరీక్షలలో మినీ మెంటల్ స్టేట్ ఎగ్జ్జామ్ అనేది చేస్తారు. ఈ పరీక్ష చేయడానికి 10-15 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇక, మెదడు సిటి స్కాన్ లేదా యంఆర్ఐ స్కాన్ల ద్వారా వ్యాధి ఏ స్థాయిలో ఉందో కచ్చితంగా అంచనా వేయవచ్చు. వ్యాధి ముదిరిన స్థితిలో రోగి పూర్తిగా కుటుంబసభ్యులపై ఆధారపడి బతుకడం చూడవచ్చు.
వ్యాధి చికిత్స
అల్జీమర్స్ వ్యాధికి వ్యాధితీవ్రత, సంబంధిత లక్షణాలను బట్టి చికిత్స చేస్తారు. ఇది పెరిగే కొద్దీ నరాలకు సంబంధించిన రుగ్మతలు గమనించవచ్చు. దీని తొలిదశలో మందులు ఇవ్వడం ద్వారా వ్యాధి తీవ్రతను నెమ్మదింప చేయవచ్చు. తద్వారా వ్యాధి ముదరకుండా చూడవచ్చు. అయితే వ్యాధి ముదిరేకొద్దీ రోగి తినడానికి, స్నానం చేయడానికి, మందులు తీసుకోవడానికి, బయటకు వెళ్లడానికి కూడా కుటుంబసభ్యుల మీద ఆధారపడి పోవడం జరుగుతుంది. తద్వారా రోగికి అనుకూలంగా ఉంచడానికి ఇంటిలో ఎన్నో మార్పులు తీసుకొని రావాల్సిన స్థితి ఏర్పడుతుంది. వీటిలో ముఖ్యంగా రోగులు పడిపోకుండా ఫ్లోరింగ్ మార్చడం వంటివి ఉంటాయి. అంతేకాకుండా, రోజులను గుర్తు పెట్టుకోవడానికి సరైన క్యాలెండర్ ఉంచడం, సమయాన్ని గుర్తుంచుకోవడానికి గడియారాలు, న్యూస్ పేపర్లు వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోగి రూంలో సరైన వెలుతురు వచ్చేలా చూసుకోవడం ద్వారా పగలు, రాత్రితో పాటూ సమయం మరియు రోజులు గుర్తుంచుకోవడానికి వారికి వీలు కలుగుతుంది.
ఇక మందుల విషయానికొస్తే మందుల డబ్బాలపై పెద్దగా కనపడేలా వాటి పేర్లు, తీసుకోవాల్సిన సమయం, డోసులు వంటివి రాసిపెట్టడంతోపాటు వాటిని తీసుకొంటున్నారో లేదో గమనిస్తూ, మరచిపోతే అందించడం ఎంతో అవసరం. లేకుంటే వారు అసలు వేసుకోకపోవడం లేదా ఎక్కువ డోసు వేసుకోవడం వంటివి చేయవచ్చు. అలానే ఈ రోగులు బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా తోడు ఉండేలా చూడాల్సి ఉంటుంది. ఇలాంటి రోగులు ఒంటరిగా బయటకు వెళ్లడం లేదా వాహనాన్ని నడపడం చేయకుండా చూడాలి. అంతేకాకుండా ఇంట్లో కూడా ఒంటరిగా వదలకూడదు. జ్ఞాపకశక్తి లేమి కారణంగా ఏర్పడే ప్రమాదాలు తగ్గించడం ఎంతో ప్రాధాన్యతతో కూడిన అంశం.
వ్యాధి నివారణ
సాధారణంగా అల్జీమర్స్ వయసుమళ్లిన వారిలో వచ్చే వ్యాధి అయినప్పటికీ, వారి కుటుంబంలో గత తరాలలో ఉండడంతో పాటూ జన్యుపరమైన ఇబ్బందులు ఉన్నవారికి నలభైలలోనే వచ్చే ప్రమాదముంది. అంతేకాకుండా ఇలాంటివారిలో వ్యాధి త్వరగా ముదిరిపోవచ్చు.
ఇక వ్యాధి నివారణా చర్యలలో ప్రధానంగా జీవనశైలిలో మార్పులు, అంటే నియమిత కాలంలో నిరంతరాయంగా వ్యాయామం, రోజూ 30 నిమిషాలకు పైగా నడవడం, ఉప్పు తగ్గించిన ఆహారం తీసుకోవడం, ఎక్కువ ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లం ఉన్న ఆహారం అంటే, చేపలు వంటి వాటిని తీసుకోవడం… మంచి అలవాట్లు. ఆల్కహాల్ తీసుకోకపోవడం మరియు పొగ తాగకపోవడం, పనులలో నిమగ్నమై శారీరక శ్రమ లేకుండా కూచోవడం.. ఆరోగ్యకరమైన లక్షణాలు కాదు. అల్జీమర్స్ వ్యాధి వస్తే తగ్గించడం సాధ్యపడదు. కాబట్టి సరైన మందులు, వైద్యంతోపాటు మంచి జీవనశైలిని కలిగి ఉండడం ద్వారా దాని తీవ్రతను నెమ్మదించవచ్చు.
డాక్టర్ ప్రియాంక సంగాని
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
రెనోవా హాస్పిటల్స్, లంగర్హౌస్
హైదరాబాద్
ఫోన్ నంబర్: 9912341701,
9912341702