ప్రైవేటులోని 20% పడకలు పేదలకు: మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా కాలంలో అనేక మంది నిరుపేదలు ఆర్థిక పరిస్థితి బాగాలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వారి నుంచి అధిక మొత్తం వసూలు చేయవద్దని డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలకు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చేతులెత్తి విజ్ఞప్తిచేశారు. సోమవారం ఆయన మహబూబ్నగర్లో మీడియాతో మాట్లాడారు. మహబూబ్నగర్ జిల్లాలో సీటీ స్కాన్ ధరలు రూ. 1,999గా నిర్ణయించినట్టు ప్రకటించారు. ఫిల్మ్తో సహా రిపోర్ట్ కావాలంటే రూ.2,790 చెల్లించాల్సి ఉంటుందన్నారు. నిరుపేదలకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు సీటీ స్కాన్ ధరలను రూ.5 వేల నుంచి రూ.1999కి తగ్గించినట్టు వెల్లడించారు. జిల్లాలోని 13 ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం అందిస్తున్నారని ఇందులో 20 శాతం అంటే 269 పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని తెలిపారు. ఈ 269 పడకలను అత్యంత నిరుపేదలకు కేటాయిస్తామన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే సదరు దవాఖానను తామే స్వాధీనం చేసుకొని డీఎంహెచ్వో ఆధ్వర్యంలో నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.