లండన్ : తమ కొవిడ్-19 వ్యాక్సిన్ రెండో డోసుతో మెరుగైన వ్యాధి నిరోధక స్పందన లభిస్తోందని జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. జాన్సన్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న ఆరు నుంచి ఎనిమిది నెలల తర్వాత రెండవ డోసు తీసుకున్న వారిలో మొదటి డోసు తీసుకున్న వారితో పోలిస్తే తొమ్మిది రెట్లు అధికంగా యాంటీ బాడీ లెవెల్స్ పెరిగినట్టు వెల్లడైందని కంపెనీ పేర్కొంది. ఫైజర్, బయోఎన్టెక్, మోడెర్నా వ్యాక్సిన్ల రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు ఇవ్వాలని అమెరికా యోచిస్తున్న నేపథ్యంలో జే అండ్ జే ఈ ఫలితాలు వెల్లడించింది.
కాగా ఈ అద్యయనంలో ఎంత మంది పాల్గొన్నారు..ఎక్కడ నిర్వహించారనే వివరాలను పరిశోధకులు వెల్లడించలేదు. పరిశోధన వివరాలు, స్టడీ డేటాను ఆహార ఔషధ మండలి (ఎఫ్డీఏ)కి సమర్పిస్తామని జే అండ్ జే తెలిపింది. ఇక అమెరికాలో ప్రస్తుతం రోగనిరోధక వ్యవస్ధ స్పందన తక్కువగా ఉన్న అమెరికన్లకు బూస్టర్ డోస్లు ఇస్తుండగా ఎఫ్డీఏ ఆమోదం లభిస్తే ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు తీసుకున్న 18 ఏండ్ల పైబడిన వారందరికీ బూస్టర్ డోస్లు ఇస్తామని బైడెన్ ప్రభుత్వం గత వారం వెల్లడించింది.