హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో దానిబారిన పడకుండా ఉండేందుకు ప్రతిఒక్కరూ ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు. కొవిడ్ రాకుండా ఏం చేయాలి, వస్తే ఏం చేయాలని వెదుకుతున్నారు. వంటింట్లోని వస్తువులతో ఒంటిని కాపాడుకోవడం ఎలా అని నెట్టింట్లో శోధిస్తున్నారు. అందులో చెప్పినవి తింటూ.. చూపించినవి చేస్తున్నారు. ఇంటర్నెట్లో వెదికిమరీ కషాయాల తయారీ ప్రయోగాలు చేస్తున్నారు. ఆహారపు అలవాట్లు, పౌష్టికాహారాలపై ఆన్లైన్లో ప్రజలు ఎలా సెర్చ్ చేస్తున్నారు. వారికి సరైన సమాచారం అందుతుందా.. లేదా తెలుసుకొనేందుకు భారత వైద్యపరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) ఆన్లైన్ ఈ-సర్వే నిర్వహిస్తున్నది. 18 ఏండ్ల వయసు నిండినవారెవరైనా ఈ సర్వేలో పాల్గొనవచ్చు. http://infodemicsurvey.nin.res.in వెబ్సైట్ను సందర్శించి 10 నిమిషాల్లో సర్వే పూర్తిచేయొచ్చు.
ఆసక్తికరమైన ప్రశ్నలు
సర్వేలో ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతున్నారు. మీరుగానీ, మీ ఇంట్లోగానీ ఎవరైనా కొవిడ్ బారినపడ్డారా? రెగ్యులర్గా ఇంటర్నెట్ వాడుతారా? రోజులో ఎన్ని గంటలు నెట్కు కేటాయిస్తారు. కొవిడ్కు సంబంధించిన సమాచారం చూస్తారా? తదితర ప్రశ్నలు ఉన్నాయి. వీటికి ఇచ్చే సమాధానం ఆధారంగా రెండోదశ ప్రశ్నలు వస్తాయి. సర్వేలో ప్రతిప్రశ్నకు కొవిడ్ ముందు, కొవిడ్ వచ్చినప్పుడు, ఆ తర్వాతా కొనసాగిస్తున్నారా? అని మూడు రకాల సమాధానాలు చెపాల్సి ఉంటుంది. ఆహారపు అలవాట్లపై మూడోదశలో కీలకమైన ప్రశ్నలు ఉంటాయి.
ఆహారపు అలవాట్లలో మార్పులు తెలుసుకుంటాం
వివిధ మాధ్యమాల ద్వారా చాలా సమాచారం వస్తున్నది. అందులో కొన్ని నమ్మదగనివి, కొన్ని నమ్మడానికి వీలులేనివి ఉంటాయి. ఇంటర్నెట్లో సెర్చ్ చేసి తెలుసుకొంటున్న సమాచారంతో ప్రజల ఆహారపు అలవాట్లు ఏమైనా మారాయా? అవి వారికి మంచి చేస్తున్నాయా లేదా అనేది అధ్యయనం చేస్తాం. రెండునెలల దేశవ్యాప్తంగా వచ్చిన సమాచారాన్ని పరిశీలించి నివేదిక విడుదల చేస్తాం.
సుబ్బారావు, ఎన్ఐఎన్ సీనియర్ శాస్త్రవేత్త