న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న వాళ్లు వెంటనే సర్జరీలు చేయించుకోకూడదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించింది. అత్యవసరం కాని సర్జరీలను కొవిడ్ నుంచి కోలుకున్న 6 వారాల తర్వాతే చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల త్వరగా కోలుకుంటారని చెప్పింది. ఇక ఇలాంటి పేషెంట్లు సర్జరీకి ముందు చేసుకునే ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్గా తేలినా కంగారు పడాల్సిన అవసరం లేదని, శరీరంలో మిగిలిపోయిన హాని చేయని చనిపోయిన వైరస్ కారణంగా ఇలా టెస్టులు పాజిటివ్గా వస్తాయని ఐసీఎంఆర్ తెలిపింది.
అత్యవసరమైన సర్జరీలైతే..
కొవిడ్ రీఇన్ఫెక్షన్ కనీసం 102 రోజుల తర్వాతే నిర్ధారణ అవుతుందని, అందువల్ల ఇలాంటి సర్జరీలను వాయిదా వేయడమే మంచిదని అంటు వ్యాధుల నిపుణులు డాక్టర్ సంజయ్ పూజారి చెప్పారు. అయితే అత్యవసర సర్జరీలను మాత్రం అన్ని ముందు జాగ్రత్తలతో వెంటనే నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. అయితే కొవిడ్ పేషెంట్లకు సర్జరీ చేసే ముందు వారి గుండె, ఊపిరితిత్తుల పనితీరును పరిశీలించాలని సూచించారు.
కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా కొంతమందిలో 60 రోజుల వరకూ కూడా అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని డాక్టర్ పూజారి చెప్పారు. అందువల్ల ఇలాంటి వారికి సర్జరీలు చేసే ముందు అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అసలు 102 రోజుల వరకూ కూడా కొవిడ్ నుంచి కోలుకున్న వారిని తిరిగి టెస్టు చేయడం అనేది సమయం వృథా చేయడమే అవుతుందని పలువురు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.
ఎవరికి ఎప్పుడు సర్జరీ?
అత్యవసరం కాని సర్జరీల విషయంలో కొవిడ్ పేషెంట్లు కోలుకున్న తర్వాత ఎంత సమయం తీసుకోవాలో ఒకసారి చూద్దాం.