ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఎదుట మొక్కలు నాటి సంరక్షించాలి
పల్లె ప్రగతిలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
కరకగూడెం, జూలై 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో అన్ని గ్రామాలూ సుందరంగా రూపుదిద్దుకోవాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. నాలుగో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా కరకగూడెం మండలంలోని భట్టుపల్లి పంచాయతీ సమీపంలోని రహదారికి ఇరువైపులా సోమవారం మొక్కలు నాటి నీరు పోశారు. తొలత మండల కేంద్రంలో ఉన్న విద్యుత్ సమస్యల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కరెంట్ స్తంభాలను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలతో అన్ని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచాలని సూచించారు. మండలంలో ఈ ఏడాది లక్ష్యానికి మించి మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పల్లెప్రగతి పనులు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంటి ఎదుట మొక్కలు నాటాలని కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమం భావితరాలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందన్నారు. ఎంపీపీ రేగా కాళిక, మండల ప్రత్యేక అధికారి బాబురావు, సర్పంచ్లు తోలెం నాగేశ్వరరావు, పాయం నరసింహారావు, ఎంపీడీవో శ్రీను,. ఎంపీవో సునిల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, పోగుల ఎల్ల గౌడ్, ముద్దం సతీశ్, సాంబయ్య, ఫారెస్ట్, రెవెన్యూ, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.