భారీ వర్షానికి నేలకొరిగిన వందల విద్యుత్ స్తంభాలు, విరిగిపడిన చెట్లు
అంధకారంలో గ్రామాలు
దాదాపు 250 ఎకరాల్లో పంట నష్టం
వనపర్తి రూరల్, మే 4: జిల్లాలో మంగళవారం కురిసిన వర్షానికి గ్రామాలు అతలాకుతలమయ్యాయి. భారీ వర్షానికి కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి పడగా మరికొన్ని చోట్ల రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. కొన్నిచోట్ల పెద్దపెద్ద చెట్లు ఈదురుగాలులు ధాటికి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. మండలంలోని అంకూర్, చిమనగుంటపల్లి, చిట్యాల, పడమటి తూర్పు తండాల్లో భారీ వడగండ్ల వర్షం, భీకరమైన గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు, గుడిసెలు, రోడ్డు వెంట ఉండే డబ్బాలు గాలికి ఎగిరిపోయాయి. ఈ మూడు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. విద్యుత్ స్తంభాలు దాదాపు 100కు పైగా నెలకొరిగాయి. భారీ చెట్లు సైతం విరిగిపోయాయి. ఈ గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచి అంధకారంలో ఉన్నాయి. విద్యుత్శాఖ అధికారులు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపాదిక పనులను చేపడుతున్నారు.
తడిసిన ధాన్యం
మదనాపురం, మే4: ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల్లో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. దుప్పల్లి, కొత్తపల్లి గ్రామాల్లో కల్లాలతోపాటు రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యమంతా తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నిలిచిన కొనుగోళ్లు
మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో హమాలీల కొరతతో రెండు రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో పాఠశాల ప్రాంగణంలో ధాన్యం నిలువలు విపరీతంగా పెరిగిపోయాయి. హమాలీల కొరతను తీర్చి ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
విరిగిన చెట్లు, కూలిన ఇండ్ల పైకప్పులు
పెద్దమందడి, మే 4: మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో మంగళవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఇండ్ల పైకప్పులు లేచిపోవడంతోపాటు చెట్లు విరిగిపడ్డాయి. భారీగా ఈదురుగాలులు రావడంతో ధాన్యంపై కప్పిన కవర్లు కూడా గాలికి కొట్టుకుపోయి ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా చేసిన ధాన్యం బస్తాలు లారీల కొరత వల్ల కేంద్రాల్లోనే ఉంచడంతో తడిసిపోయాయి.
పిడుగుపాటుకు బాలుడి మృతి
గట్టు, మే 4: పిడుగుపాటుకు గట్టుకు చెందిన బాలుడు కర్ణాటకలోని మటుమారి శివారులో మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ఏటా డిసెంబర్లో గొర్రెలను కర్ణాటక తరలించి మేపడం, తదనంతరం వర్షాకాలం ఆరంభంలో తిరిగి వాటిని ఇక్కడికి తీసుకురావడం ఆనవాయితీ. ఈ క్రమంలో గట్టుకు చెందిన వెంకటన్న(సౌకారి), కుర్వ జమ్ములయ్య, కుర్వ సూరి తమ గొర్రెల మందను కర్ణాటకకు తీసుకెళ్లారు. గొర్రెలను మటుమారి శివారులోని అడవిలో మేపిన తర్వాత పొలాల్లో వలలు వేయడానికి అందరు ఉపక్రమించారు. గొర్రెల మందల యజమానులు ఇద్దరు ముందు వెళ్తుండగా వెనుకన వెంటకన్న కుమారుడు సవారి(15) వెళ్తున్నాడు. ఈ సమయంలో ఆకాశం మేఘావృతం కాగా సవారి పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే ముందు వెళుతున్న వారు సవారి ఇంకా రాకపోవడాన్ని గమనించి వెనుకకు వెళ్లి చూడగా సవారి కిందపడి ఉండడాన్ని గమనించారు. అప్పటికే సవారి మృతిచెందినట్లు నిర్ధారించుకుని బోరున విలపించారు. కాగా వీరు దూరం ఉండడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పిడుగుపాటుతో ఓ గొర్రెపిల్ల కూడ మృతిచెందింది. ఘటనా స్థలంలో సెల్ఫోన్, పవర్బ్యాంక్లు కింద పడి పేలి ఉండడాన్ని స్థానికులు గమనించారు.
భగవాన్తండాలో మహిళ ..
భూత్పూర్,మే 4: మండలంలోని పెద్దతండా గ్రామ పంచాయతీ భగవాన్తండాలో పిడుగుపాటుకు మహిళా రైతు చిట్టి(27) మృతి చెందారు. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పశువులను మేతకు తీసుకెళ్లి మృతురాలి సమీపంలోనే పిడుగు పడడంతో చిట్టితోపాటు ఆమె ఆవు కూడా అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త శ్రీనునాయక్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అంత్యక్రియలకు తండాకు చెందిన సుశీలరెడ్యా నాయక్ ఆర్థిక సాయం చేశారు. మండలంలోని వెల్కిచర్ల గ్రామంలో దేవరకొండ కుర్మయ్యకు చెందిన ఆవు, కోడెదూడ పిడుగుపాటుకు గురయ్యాయి. వీటి విలువ దాదాపు రూ.లక్షకు పైగానే ఉంటుందని స్థానికులు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వరి ధాన్యం పెద్ద ఎత్తున తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదేవిధంగా భారీగా వీచిన గాలికి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భూత్పూర్తోపాటు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.