కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్పీకర్గా మరోసారి బిమన్ బెనర్జి ఎన్నికయ్యారు. బెంగాల్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి సమక్షంలో ఎమ్మెల్యేలంతా కలిసి ఆయనను స్పీకర్గా ఎన్నుకున్నారు. బెహాలా వెస్ట్ ఎమ్మెల్యే పార్థ చటర్జి స్పీకర్గా బిమన్ బెనర్జి పేరును ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదన డమ్డమ్ నార్త్ ఎమ్మెల్యే చంద్రమా భట్టాచార్య బలపర్చారు. ఈ ప్రతిపాదన ఆధారంగా ప్రొటెం స్పీకర్ సుబ్రతా ముఖర్జి వాయిస్ ఓటింగ్ నిర్వహించి బిమన్ బెనర్జి స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రకటించారు.
కాగా, బిమన్ బెనర్జి పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నిక కావడం వరుసగా ఇది మూడోసారి. 2011లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అసెంబ్లీ స్పీకర్గా కొనసాగుతున్నారు. టీఎంసీ వరుసగా మూడుసార్లు అధికారంలోకి రాగా.. ఆ మూడుసార్లూ స్పీకర్గా బిమన్ బెనర్జినే ఎన్నుకున్నారు. కాగా, నూతన స్పీకర్ బిమన్ బెనర్జికి ముఖ్యమంత్రి మమతాబెనర్జి, తోటి ఎమ్మెల్యేలు అంతా శుభాకాంక్షలు తెలిపారు. ఇక బిమన్ బెనర్జి సైతం ముఖ్యమంత్రి మమతాబెనర్జి, తోటి ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.