న్యూయార్క్ : కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు అదనంగా బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రముఖ అంటువ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌసీ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ పూర్తయిన అమెరికన్లకు ప్రస్తుతం మూడో డోస్ అవసరం లేదని సీడీసీ, అమెరికన్ ఆహార ఔషధ సంస్థ (ఎఫ్డీఏ) సంయుక్త ప్రకటనలో పేర్కొన్న అనంతరం డాక్టర్ ఫౌసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా ఫైజర్ వ్యాక్సిన్ మూడో డోస్తో గతంలో ఇచ్చిన రెండు డోసులతో పోలిస్తే ఐదు నుంచి పదిరెట్లు యాంటీబాడీల తటస్థీకరణ జరిగినట్టు గతవారం విడుదల చేసిన డేటా తెలిపింది. అయితే వ్యాక్సిన్ తొలి రెండు డోసులతో తయారైన యాంటీబాడీలు తగ్గిపోతున్నట్టు ఆధారాలు వెల్లడి కానందున బూస్టర్ డోస్పై సీడీసీ, ఎఫ్డీఏల సంయుక్త ప్రకటనతో తాను ఏకీభవిస్తున్నానని డాక్టర్ ఫౌసీ చెప్పారు. బూస్టర్ డోస్లు అప్పటికే తయారైన యాంటీబాడీలను ప్రేరేపిస్తాయని, యాంటీబాడీలను కోల్పోకుండా నిరోధించలేవని అన్నారు.