న్యూఢిల్లీ/చెన్నై/తిరువనంతపురం, ఏప్రిల్ 6: మినీ ఎన్నికల సంగ్రామంలో అత్యంత కీలక ఘట్టం ముగిసింది. దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి శాసనసభలకు మంగళవారం ఒకే విడుతలో ఎన్నికలు జరిగాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్టు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. కేరళలో 74%, తమిళనాడులో 65.68%, పుదుచ్చేరిలో 80.67% పోలింగ్ నమోదైనట్టు తెలిపింది.
తమిళనాడులో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అన్నాడీఎంకే అగ్రనేతలు పళనిస్వామి, పన్నీర్సెల్వం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా నమక్కల్లో 70.79 శాతం, అత్యల్పంగా తిరునల్వేలిలో 50.05 శాతం పోలింగ్ నమోదైంది. డీఎంకే అభ్యర్థి ఉదయనిధి స్టాలిన్ తన పార్టీ గుర్తు ఉన్న చొక్కాను ధరించి ఓటు వేశారని ఈసీకి అన్నాడీఎంకే ఫిర్యాదు చేసింది. హ్యాట్రిక్ విజయం కోసం అన్నాడీఎంకే ఉవ్విళ్లూరుతుండగా, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని డీఎంకే పట్టుదలతో ఉన్నది.
కేరళలో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కట్టయికోనంలో సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ తలెత్తింది. నలుగురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. పతినంతిట్టలో క్యూలో నిల్చున్న ఇద్దరు ఓటర్లు కుప్పకూలి మరణించారు.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 80.67 శాతం పోలింగ్ నమోదైంది. ఏఐఎన్నార్సీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి, కాంగ్రెస్ నేతృత్వంలోని లౌకిక ప్రజాస్వామ్య కూటమి మధ్యే పోటీ నెలకొన్నది.
చెన్నైలో తమిళ హీరో విజయ్ సైకిల్పై వచ్చి ఓటేశారు. మోదీ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచటంపై విజయ్ తన నిరసనను ఇలా తెలియజేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్త్నెలోని విరుగంబక్కంలోని పోలింగ్కేంద్రంలో ఆమె ఓటు వేశారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో శక్తివంతమైన ఆయుధమని, దానిని ఉపయోగించుకుని మంచి పాలకులను ఎంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
చెన్నై, ఏప్రిల్ 6: చెన్నైలోని తిరువన్మియూర్ ప్రాంతంలోని పోలింగ్ స్టేషన్లో ప్రముఖ తమిళ నటుడు అజిత్, ఆయన భార్య షాలిని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అజిత్తో సెల్ఫీకి ఓ అభిమాని ముందుకొచ్చాడు. అతడి ముఖానికి మాస్కు లేకపోవటంతో కోపంతో అతడి మొబైల్ను లాక్కొన్నారు. కొంత సేపటి తర్వాత ఫోన్ను తిరిగి ఇచ్చేశారు.
గువాహటి/కోల్కతా, ఏప్రిల్ 6: అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. చివరి విడుతైన మూడోదశలో భాగంగా మంగళవారం 40 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. 79 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్లో మూడో విడుతలో భాగంగా మంగళవారం 31 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 77 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. మూడో విడుతలోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను కేంద్ర బలగాలు బెదిరిస్తున్నాయని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఓ గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో 4 ఈవీఎంలు, వీవీ ప్యాట్లను గుర్తించినట్టు అధికారులు మంగళవారం తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మధ్యవర్తులను ప్రకటిస్తే జవాన్ను అప్పగిస్తాం
బీజేపీ ఎంపీని ఘెరావ్ చేసిన రైతులు
పంజాబ్ నుంచి యూపీకి గ్యాంగ్స్టర్ తరలింపు
మీలాగే.. మేం హిందువులకు పిలుపునిస్తే..
సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగు తేజం