ఈ కరోనా వచ్చిపోవుడేందో కానీ శరీరాన్ని బండకు వేసి ఉతికినట్టు తయారవుతున్నది. ఏ పని చేద్దామన్నా తొందరగా అలసట, ఆయాసం వచ్చేస్తున్నాయి. కీళ్లు, కండరాలు, మెడ, వెన్నెముక నొప్పులతో నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నాం. ఈ సమస్యల నుంచి బయటపడటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినాల్సిన ఆహారం తదితర విషయాలను ప్రముఖ నేచురోపతి ఫిజీషియన్, బ్యాక్ అండ్ నెక్ పెయిన్ స్పెషలిస్టు డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్ ‘నమస్తే తెలంగాణ’తో వెల్లడించారు.
–హైదరాబాద్, నమస్తే తెలంగాణ
మందులు వాడి, దవాఖానల్లో చికిత్స పొంది రెండు వారాలకు కరోనా నుంచి బయటపడిన బాధితుల్లో 50 శాతానికిపైగా ఒళ్లు, కీళ్ల నొప్పులు ఉంటున్నాయి. కరోనా నుంచి కోలుకున్నవాళ్లంతా కచ్చితంగా 15 రోజుల నుంచి నెల పాటు నొప్పులు తీవ్రతరం కాకుండా కాపాడుకోవాలి.
పెయిన్ కిల్లర్స్ అస్సలు వాడొద్దు. వీటివల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. డాక్టర్ సలహాతోనే వాడాలి. లేకపోతే కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎక్సర్సైజ్లు చేసినా ఒళ్లునొప్పులు పెరుగుతాయి, నీరసం వస్తుంది.
ఆహార నియమావళితో ఉపశమనం పొందవచ్చు. నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. బార్లీ నీళ్లు తాగడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కరోనా మందులు వాడాక శరీరంలో ఉండే టాక్సిసిటీని బార్లీ గింజలు తగ్గిస్తాయి. కండరాల్లో ఏర్పడే వాపు, మంట తగ్గుతుంది. ఉదయం లేవగానే గోరువెచ్చటి నీటిలో సగం నిమ్మకాయ ముక్కను పిండుకొని తాగాలి. దీనివల్ల శరీరంలో విటమిన్-సీ సమృద్ధిగా పెరిగి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శరీర మెటబాలిజం చురుగ్గా మారుతుంది. ఎలర్జీ లేకపోతే రాత్రి పడుకొనేముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగాలి. పసుపు వల్ల యాంటిఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అభివృద్ధి చెందుతుంది. అలాగే కరోనా బారిన పడినవారికి మోకాళ్ల కింది కండరాలు విపరీతంగా గుద్దినట్టు నొప్పి పుడుతాయి. దీనిని తగ్గించడానికి బకెట్ వేడినీళ్లలో ఎప్సం సాల్ట్ (20 గ్రాములు) వేసి కాళ్లను అందులో ఉంచాలి. దొడ్డు ఉప్పు వేసుకున్నా ఫరవాలేదు.
శరీరంలోని శక్తిని వృథా చేయకుండా ఉపయోగించుకోవాలి. కరోనా తగ్గాక 10 రోజులపాటు మాంసాహారం తినకపోతేనే మంచిది. మాంసాహారం అరగడానికి ఎక్కువ శక్తి, శ్రమ అవసరమవుతుంది. సాత్విక ఆహారమే మంచిది.
రోగనిరోధకశక్తికి విటమిన్-డీ ముఖ్యమైనది. ఉదయం 6.30 నుంచి 8.30 వరకు సూర్యరశ్మి ఒంటిపై పడేలా చూసుకోవాలి. కూల్డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, చల్లటి పదార్థాలు, ఫ్రిజ్లో పెట్టిన వస్తువులు వాడవద్దు. పండ్లను ఉప్పు వేసిన నీటితో కడుక్కొని తినాలి. తాజా మాంసమే తినాలి. నిమ్మకాయ, గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.
వైద్యులు ఇచ్చే మందులతో పాటు కషాయం తాగాలి. ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు చొప్పున ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వాము, అల్లం, పసుపు, లవంగాలతో తయారుచేసిన కషాయాన్ని తాగాలి. అన్నివేళలా గోరువెచ్చటి నీటినే తాగాలి. ఉదయం, సాయంత్రం నీటి ఆవిరి పట్టాలి. ఉప్పు, పసుపు వేసిన నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.