వాషింగ్టన్ : డెల్టా వేరియంట్ కేసులు వేగంగా ప్రబలుతుండటంతో అమెరికాలో కరోనా పరిస్థితి దిగజారేలా ఉందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంథోని ఫౌసీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికీ 10 కోట్ల మంది అర్హులైన అమెరికన్లు వ్యాక్సిన్లు వేయించుకోలేదని, టీకా తీసుకోనివారిలో వైరస్ వ్యాప్తిని చూడబోతున్నామని ఫౌసీ వ్యాఖ్యానించారు. మహమ్మారి వ్యాప్తితో రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. టీకాతోనే మనకు రక్షణ లభిస్తుందని ఎంతగా చెబుతున్నప్పటికీ ప్రజలు ముందుకురాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక డెల్టా వేరియంట్ కారణంగా కేసులు గణనీయంగా పెరిగినా అమెరికాలో తిరిగి లాక్డౌన్లు అమలవుతాయని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. గత ఏడాది వైరస్ విజృంభణతో మనం ఎదుర్కొన్న పరిస్థితికి తిరిగి మనం వెళ్లబోమని తనకు విశ్వాసం ఉందని చెప్పారు. డెల్టా వేరియంట్తో అమెరికాలో ఇటీవల కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.మరోవైపు దేశ జనాభాలో దాదాపు సగం జనాభాకు ఇప్పటివరకూ కొవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తయిందని సీడీసీ పేర్కొంది.