27 నుంచి ప్రారంభంకానున్న అభివృద్ధి పథకం
బీసీల్లోని 75 కులాలకు లబ్ధి
కుల, చేతి వృత్తులపై శిక్షణరైతులకు ఆధునిక యంత్రాలు
మంత్రి గంగుల ప్రకటన
రూ.100 కోట్లతో మహిళలకు నిధి
నాగర్కర్నూల్, ఏప్రిల్4(నమస్తే తెలంగాణ):పేద, బడుగు వర్గాల సంక్షేమం దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేయనున్నది. బీసీ వర్గాల ప్రజలను ఆదుకొనేందుకు కొత్తగా ‘కేసీఆర్ ఆపద్బంధు’
పేరిట పథకం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించడంతో ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకంతో బీసీల్లోని దాదాపుగా 75 కులాల్లోని లక్షలాది ప్రజలకు లబ్ధి చేకూరనున్నది.
సీఎం కేసీఆర్ పేద,బడుగు వర్గాల అభివృద్ధి, సంక్షేమం దిశగా తీసుకుంటున్న పథకాలు, చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే ఆహార భద్రత, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, గొర్రెలు, చేప పిల్లల పంపిణీలాంటి పలు పథకాలను అమలు చేస్తున్నారు. దీంతో పేద వర్గాల్లో ఆర్థిక స్థిరత్వం పెరుగుతున్నది. ఈ క్రమంలో సమాజంలో అత్యధిక భాగమున్న బీసీ కులాల్లోని చేతి వృత్తిదారులను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం పేరిట కేసీఆర్ ఆపద్బంధు పేరిట టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవమైన ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేసిన ప్రకటన బీసీ ప్రజల్లో హర్షాతిరేకాలను నింపుతున్నది. ఇందులో భాగంగా రూ.5,522కోట్ల నిధులను వెచ్చించనుండటం విశేషం.
మహిళలకు ప్రత్యేక శిక్షణ
పథకం కింద కేటాయించిన నిధులతో గ్రామీణ మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో సంఘంలో 25మంది మహిళలను సభ్యులుగా చేసి నిఫ్ట్ తరహాలో శిక్షణకు కార్యాచరణ చేపట్టనున్నారు. అనంతరం కుట్టు మిషన్లను అందజేయనున్నారు. దీనికిగానూ రూ.100కోట్లతో మహిళా స్వావలంబన పథకం తీసుకురానున్నారు. ఇక బీసీ కులాల్లోని నాయీబ్రాహ్మణ, రజక, విశ్వబ్రాహ్మణ, సగర, కుమ్మరి, వడ్డెర, మేదరిలాంటి కులవృత్తులను కాపాడేందుకు సైతం మరో పథకం అమలు కానున్నది. ఇందులో భాగంగా ఆయా కులవృత్తిదారులకు పని ముట్లను అందజేయనున్నారు. బైక్లు, ఏసీల మరమ్మతుల శిక్షణ సైతం ఇవ్వనున్నారు. ఇలా వేలాది మంది బీసీ యువతకు వృత్తి నైపుణ్య, శిక్షణలు ఇచ్చేందుకు ఈ పథకం అమలు అవుతున్నది. ఇవేకాకుండా బీసీల ఆత్మగౌరవ భవనాలను సైతం నిర్మించనున్నారు. ముఖ్యంగా బీసీలను రైతులుగా మరింత ఎదిగేందుకు చేయూతను అందించడం జరగనున్నది. అత్యాధునిక యంత్రపరికరాలను అందిస్తారు. ఇలా బీసీల సంక్షేమం కోసం బడ్జెట్లో సీఎం కేసీఆర్ రూ.5,522కోట్లను కేటాయించడం జరిగింది. ఇప్పటికే బీసీల్లోని మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలు, ద్విచక్ర వాహనాలు, ట్రాలీ ఆటోలు, రుణాలను అందిస్తోంది. గొల్లకురుమలకు గొర్రెలను అందజేయనున్నారు.
ఇవి కూడా చదవండి