సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని శ్రమచేసేటోళ్ల చేతుల్లోనే లక్ష్మి దాగుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆదివా రం సిద్దిపేట, కామారెడ్డి సభల్లో సీఎం మాట్లాడుతూ, ‘ఒకప్పుడు పేరుకే రైతులు, రైతే రాజు.. కానీ నిజానికి రాజు లేడు. మట్టి లేడు.. అదంతా ఒట్టి గ్యాస్. రైతు ఎనుకకు మర్రిచూస్తే అన్నీ అప్పులు. పంచె ఏసుకొని తిరుగుతడు.. ‘పటేల్ నమస్తే’ అంటే అడికే సంతోపడ్త డు. ఎనుకకు మరితే మొత్తం అప్పులే ఉంటయి. నేను అదే జాతి నుంచి వచ్చిన కాబట్టి తెలుస్తది బాధ. ఒక లైను పట్టుకొని మెల్లమెల్లగా కరెంట్ బాగు చేసుకున్నం. దాన్ని 24 గంటలకు తెచ్చినం. ఇగ మనోళ్లు వట్టిగానే బుస్సుమంటరు. లేకుంటే తుస్సుమంటరు. 24 గంటలు కరెంట్ ఇయ్యంగానే వద్దు సార్.. వద్దు బేకార్ అయితది. అలవాటైంది ఉండాలి అన్నరు. ఇగ పంట లు పండుతయ్. చెప్తున్నా మీరు అద్భుతాలు చేస్తరు. మీరు శ్రమ చేసేటోళ్లు.. మీ చేతిలో లక్ష్మి ఉన్నది.’
నిన్నటి మొన్నటి దాకా పంజాబ్ అగ్రగామి రాష్ట్రం. వాళ్ల దగ్గర పండేది 2కోట్ల 2లక్షల టన్నులు. ఇయ్యాల తెలంగాణలో మూడు కోట్ల టన్నుల వడ్లు పండినయ్. కేంద్ర సర్కారుకే కోటి 40 లక్షల టన్నుల వడ్లు జోకినం. ఇది కేంద్రం చెప్తున్న లెక్క. నిన్నటి లెక్క 91 లక్షల టన్నులు జోకిన్రు. ఇదెట్ల సాధ్యమైంది? 9 లక్షలకే దిక్కులేకుండే. మనం వాడుతున్న ఎరువులు అన్ని పంటలకు కలిసి 26 లక్షల టన్నులు. ఎరువు బస్తాలు వస్తే ఏడబెట్టాలో తెలియదు. మొత్తం తెలంగాణల 4 లక్షల టన్నుల గోదాములే ఉండే. అప్పుడు హరీశ్రావు దగ్గర పోర్ట్ఫోలియో ఉండే (మార్కెటింగ్శాఖ). అర్జెంట్గా గోదాములు 25 లక్షల టన్నులకు తీసుకపోవాలె అని చెప్పిన. ఆగమేఘాల మీద జాగలు వెతికి మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ గోదాములు ఉండాలని చెప్పి, 25 లక్షల టన్నుల గోదాములు ఏర్పాటు చేసుకొన్నాం. అప్పటి ప్రభుత్వాలు ఎరువు బస్తాలు కావాలంటే పోలీస్స్టేషన్లో అమ్మిన్రు అప్పటి మహానుభావులు. ఇప్పుడు ఎరువు బస్తాలకు తిప్పల్లేవు. ఎట్ల సాధ్యమైంది? ఆలోచించాలి.
తెలంగాణలో మంచినీళ్లకు బాధలు పోయినయ్. మిషన్ భగీరథ పథకం ఇదొక విప్లవం. భారతదేశంలో ఎక్కడా లేదు. కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతాయి. వాళ్లకు సిగ్గుశరం ఏమన్న ఉంటదో నాకర్థం కాదు. నేను చెప్పుమంటే ఇరవై పద్యాలు చెప్పి మస్తుగ చెప్త కథ.. కానీ పని కావాలి కదా! పనైతే ప్రజల అనుభవంలోకి రావాలి కదా! నేను చెప్పేటియన్నీ కూడా జరిగినవి. ఎవర్ని అడిగినా.. ఏ ఊరికి పోయిన చెప్తరు. పేరుకు రైతే అయినా కూసోడానికి జాగ లేదు. అందుకే రైతువేదిక కట్టాలని చెప్పిన. ‘ఇండియాలో ఎవరైన కడుతుర్రా అన్నది మనకు అనవసరం. మనం కడుతున్నం’అన్న. రాష్ట్రవ్యాప్తంగా భూమెంత? అందులో పంట పండే భూమెంత? అనే లెక్కలు ఎవరికీ తెల్వదు. చీకట్ల బాణమేస్తే ఎటు తాకుతదో తెల్వదు. ఇవాల్టికీ కొన్నిటికి లెక్కలేదు, పత్రం లేదు. అధికారుల మీద మామూలు లొల్లి పెట్టలె! వాళ్లు నన్ను చూస్తనే ఎక్కడ మోపైండు అనే పరిస్థితి. తెలంగాణలో మొత్తం భూమి 2 కోట్ల 75 లక్షలు ఎకరాలు. దీంట్లో రైతుల బాపతి కోటిన్నర. ఈ ఎవుసం సక్కగా సాగాలంటే ఏం చేయాలో ఆలోచించినం. అశోక్ గులాటే ఆగ్రో ఎకనామిస్ట్ మంచి దోస్తు ఆయ న. స్వామినాథన్ ఉండె. మన దగ్గర కూడా పెద్ద పెద్ద రైతులున్నరు. వీళ్లందరినీ సమీకరించి మాట్లాడి.. మా బతుకుదెరువు గిట్లుంది.. ఏం జేయాలని ఆలోచన చేసి ఓ తొవ్వ బట్టిన. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్గా ఏర్పాటుచేసినం. రైతు వేదికలు ఏర్పాటుచేసినం. 2601 రైతు వేదికలు ఇవాళ తెలంగాణలో ఉన్నాయి. ఎవరన్న మొగోడు గీడ లేవని చూపిస్తే అదే నిమిషంలో రాజీనామా చేసిస్తా పదవికి. ఇది వాస్తవం. రైతు వేదికలు నిర్మించుకొన్నం. రైతు వేదికలలో రైతుల సమావేశాలు వెంటనే ప్రారంభం కావాలి.
మేము రైతు కేంద్రంగా పనిచేస్తున్నాం. కొందరు కావాలనే మొరుగుతరు. కరోనా నేపథ్యంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెడితే దానిపై చాలామంది ఆధారపడి పనిచేసుకొని మంచి లాభం పొందిన్రు. రైతులు బాగుంటే ప్రతి ఒక్కరు బాగుంటారు. రైతు చల్లగా ఉంటేనే దేశం చల్లగా ఉంటుంది. నా మిత్రులంతా కూర్చొని రైతుల గురించి ఏదో చేయాలని ఆలోచించి రైతులకు ధనం రూపంలో సహాయం చేయాలనే ఆలోచనకు వచ్చినం. దాంట్లో నుంచి పుట్టిందే రైతుబంధు పథకం. టంగ్.. టంగ్ మంటూ రైతుబంధు రైతులకు నేరుగా అందుతున్నది. డైరెక్ట్గా రైతులకే డబ్బులు చేరుతుండటంతో గీకెటోడు, గోకెటోళ్లు ఆగమైంతుండ్రు. రైతుబంధు పేరు మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు రూ.15 వేల కోట్లు. ఇందులో రూ.150 కోట్లు అయినా తినలేదని కొంతమంది బాధపడుతున్నరు. మధ్యలో దళారి, దరఖాస్తు లేకుండా రైతుల ఖాతాలకు నేరుగా వెళుతున్నది. 95% రైతులు రైతుబంధు సొమ్మును సద్వినియోగం చేసుకుంటున్నారు. రైతురాజ్యమంటే ఇదే.
తెలంగాణ ఏర్పడే క్రమంలో ప్రొఫెసర్ జయశంకర్, ఆర్ విద్యాసాగర్తో కలిసి ఢిల్లీలో ఉన్నం. రాత్రి 2 దాటింది. రాష్ట్రం ఏర్పాటైతే పని ఎక్కడ మొదలుకావాలి? ఏం చేయాలి? 11వ శతాబ్దంలో వాళ్ల కడుపు చల్లగుండ.. కాకతీయ రాజులు వరుసకట్టి తెలంగాణలో గొలుసుకట్టు చెరువులను తవ్విన్రు. 70 వేల చెరువుల కింద 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన్రు. అవి సమైక్య పాలనలో సర్వనాశనమైనయి. 40 వేల చెరువులు మిగిలినాయి. నీళ్లు నిల్వయి.. దబ్బన వాన గట్టిగ కొడితే.. పటాకులు పేలిపోయినట్లు తెగిపోతయ్. అగో అక్కడ మొదలుపెట్టినం.. తెలంగాణ రావడానికి నాలుగునెలల ముందు ఢిల్లీలో నిర్ణయించినం. రాజులు తవ్వించిన తొవ్వ కాబట్టి బర్కత్ ఉంటది.. పని మంచిగైతదని దాని పేరు ‘మిషన్ కాకతీయ’ అని పెట్టినం. వాళ్లను తలుచుకున్న కూడా అన్నం పుడుతది. తెలంగాణ రావడానికి 4 నెలల ముందు ఢిల్లీలో పెట్టుకున్న పేరది.