న్యూఢిల్లీ: పెండ్లికి వచ్చిన అతిథులతో ప్లేట్లు, కప్పులు, గిన్నెలు కడిగించారు. మూడేండ్ల కిందట జరిగిన ఈ ఘటన గురించి ఆ వివాహానికి హాజరైన ఒక మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. వధువరులు చాలా ఆడంబరంగా పెండ్లి చేసుకోవాలనుకున్నారు. ఖరీదైన్ సూట్లో పలు రోజులు బస చేశారు. వధువుకు ఖరీదైన డ్రెస్, పెండ్లి వేదికకు చాలా డబ్బులు ఖర్చయ్యాయి. దీంతో డబ్బులన్నీ అయిపోవడంతో పెండ్లికి హాజరైన అతిథిలకు సెల్ఫ్ కేటర్ విందు ఏర్పాటు చేశారు. తక్కువ ఫుడ్ సర్వ్ చేయడంతో చాలా మంది అతిథులు కడుపు మాడ్చుకున్నారు.
అనంతరం హోటల్ సిబ్బంది ఒకరు చావు కబురు చల్లగా చెప్పారు. సెల్ఫ్ కేటర్ కోసం వినియోగించిన పాత్రలు, ప్లేట్లు, గిన్నెలు, ఇతర వస్తువులను శుభ్రం చేసి ఇవ్వని పక్షంలో డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి రావని తెలిపారు. వీటిని శుభ్రం చేసేందుకు పనిమనిషిని కూడా వారు పెట్టుకోలేదు. దీంతో చేసేదేమీ లేక వధువు బంధువులైన ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహిళతోపాటు మరో తొమ్మిది మంది వంటగదిలోకి వెళ్లి ప్లేట్లు, గిన్నెలు వంటి వాటిని తోమి కడిగారు. అయితే ఆ జంట మూడేండ్లకే విడిపోయింది. కాగా, వధువు రెండో పెండ్లికి తనను ఆహ్వానించినప్పటికీ గత అనుభవంతో వెళ్లలేదని ఆ పోస్ట్లో ఆమె పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ పోస్ట్ను చూసిన నెటిజన్లు పలు హావాభావాల ఎమోజీలతో బదులిచ్చారు.