విద్యానగర్, మే 20 : దానం చేసే గుణం అందరికీ ఉండదు.. తమ వద్ద డబ్బులు ఉన్నా.. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే వారు చాలా అరుదు. ప్రస్తుతం సెకండ్వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో రోడ్డుపై అడుక్కునేవారు.. కొవిడ్ బారిన పడి వంట చేసుకునే పరిస్థితిలో లేనివారి కోసం మేమున్నామంటూ ముందుకు వచ్చారు కామారెడ్డికి చెందిన శ్రీసాయి చారిటబుల్ ట్రస్టు, మెహర్బాబా క్యాటరింగ్ వారు. ప్రతి రోజూ దాదాపు రూ.25 వేల వరకు ఖర్చు చేస్తూ సుమారు 250 మంది ఆకలిని తీరుస్తున్నారు.
ఒక పూట టిఫిన్, రెండు పూటల భోజనం..
బాధితులకు ప్రతిరోజూ ఉదయం ఒక పూట టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం సమకూరుస్తున్నారు. భోజనం కోసం రెండు రకాల కూరలు, పప్పుచారు, ఒక గుడ్డు, పెరుగు, డ్రైఫ్రూట్స్, చపాతి, ఆలు కుర్మాను ప్యాకింగ్ చేసి కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇండ్లకు వెళ్లి అందజేస్తున్నారు. వీరితో పాటు రోడ్లపై నివసించే వారికి, బస్టాండ్, రైల్వేస్టేషన్ ఆవరణలో ఉంటున్న వారికి భోజన సదుపాయం కల్పిస్తున్నారు.
వంటలను తయారు చేసి..
శ్రీసాయి చారిటబుల్ ట్రస్టు, మెహర్బాబా క్యాటరింగ్కు చెందిన మిత్రులు ఎంజీ చక్రవర్తిగౌడ్, యాద శ్రీనివాస్, భగత్, గబ్బుల శేఖర్, బొందుగుల శ్రీనివాస్, భగత్, గోపి తదితరులు కలిసి భోజన ఏర్పాట్లను చూస్తున్నారు. వారే భోజనాన్ని స్వయంగా తయారు చేసి కొవిడ్ నిబంధనలను పాటిస్తూ.. బాధితులకు అందజేస్తున్నారు. వారం రోజులుగా ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. లాక్డౌన్ ముగిసే వరకు ఉచితంగా భోజనాన్ని అందజేస్తామని, అవసరం ఉన్న వారు 984934 6058, 9440442688 నంబర్లకు ఫోన్ చేయాలని వారు సూచిస్తున్నారు.