హైదరాబాద్, జులై 9 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఇన్ఫ్రా గ్రూప్ రాంకీ అక్రమ లావాదేవీలకు పాల్పడి భారీగా పన్ను ఎగవేసినట్లు ఆదాయం పన్ను (ఐటీ) శాఖ గుర్తించింది. లాభాలను దాచిపెట్టి దాదాపు రూ.1,200 కోట్ల మేరకు కృత్రిమ నష్టాలను రాంకీ సంస్థలు చూపాయని నిర్ధారణ జరిగింది. నిర్మాణ, స్థిరాస్తి, కూల్చివేతల వ్యర్థాల నిర్వహణ తదితర రంగాలలో పేరొందిన రాంకీ గ్రూప్ సంస్థల్లో ఐటీ శాఖ ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. గచ్చిబౌలీలోని రాంకీ ప్రధాన కార్యాలయంతోపాటు బ్రాంచీల్లో ఈ నెల 6న ఉదయం నుంచే సోదాలు జరిగాయి. భారీ నష్టాలను చూపినా.. షేర్ల విలువ ఉన్నట్టుండి రెట్టింపు కావడంతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి అనుమానం వచ్చింది. దీంతో ఐటీ శాఖకు సమాచారమిచ్చింది. ఈ క్రమంలోనే దాడులు చేయగా, ఈ సోదాలలో సంస్థ అక్రమ లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ సింగపూర్లోని ఒక ఎన్ఆర్ఐ సంస్థకు మెజార్టీ వాటాను విక్రయించి భారీగా మూలధనాన్ని ఆర్జించినట్లు ఐటీ శాఖ గుర్తించింది. అయితే ఈ లావాదేవీల పత్రాలను దాచిపెట్టి, నష్టాలను మాత్రమే ఖాతాలలో పేర్కొన్నారు. ఇదిలావుంటే లెక్కల్లోకి రాని దాదాపు రూ.300 కోట్లతోపాటు ఎగవేసిన పన్నును చెల్లించడానికి రాంకీ అంగీకరించినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు.