Research: ప్రాణాంతక కరోనా మహమ్మారి బారినపడినా యువతీ, యువకుల్లో ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం చాలా తక్కువేనని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. కరోనా బారినపడి కోలుకున్న యువతీయువకుల్లో ఊపిరితిత్తుల పనితీరుపై ఎలాంటి ప్రభావం పడలేదని, కరోనా సోకకముందు వారి ఊపిరితిత్తులు ఎలాగైతే పనిచేశాయో.. కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా అలాగే పనిచేస్తున్నాయని ఓ నూతన అధ్యయనంలో స్పష్టంచేశారు. ఈ అధ్యయానికి సంబంధించిన పరిశోధనా పత్రాన్ని ఇటీవల యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్కు సమర్పించారు.
ఈ నూతన అధ్యయనం ప్రకారం యుక్త వయసులో ఉన్నవారికి కరోనా వైరస్ సోకితే.. వారి ఊపిరితిత్తుల పనితీరుపై ఆ వైరస్ ఏమాత్రం ప్రభావం చూపదట. అంతేకాదు, ఆస్తమా రోగుల ఊపిరితిత్తుల పనితీరుపై కూడా కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపదని స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ పరిశోధకురాలు డాక్టర్ ఐడా మాగెన్సెన్ చెప్పారు. శ్వాస తీసుకోవడంలో వారు కొంచెం ఇబ్బందిపడ్డా.. ఊపిరితిత్తుల పనితీరు మాత్రం ప్రభావితం కాదని తెలిపారు.
ఇదిలావుంటే కొవిడ్ మహమ్మారి బారినపడి కోలుకున్న యువతలో మాత్రమే కాదు, చిన్నారుల్లో కూడా ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని మరో కొత్త అధ్యయనంలో వెల్లడించారు. చిన్నారులు, యువతీయువకుల లంగ్స్పై కరోనా మహమ్మారి ప్రభావం ఏమాత్రం ఉండదని పేర్కొన్నారు. కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా చిన్న పిల్లలు, టీనేజర్స్లో ఊపిరితిత్తులు సురక్షితంగానే ఉంటాయని స్పష్టంచేశారు. అయితే, కరోనా మహమ్మారి సివియర్గా ప్రభావం చూపిన వారిలో మాత్రం ఊరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు.
అయితే, కొంతమంది మాత్రం తమకు కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిపోయిన తర్వాత.. తమ ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం పడిందేమోనని, సరిగా పనిచేస్తున్నాయో లేదోనని ఆందోళన చెందుతుంటారని డాక్టర్ ఐడా మోగెన్సెన్ చెప్పారు. ఇలా ఆందోళన చెందేవారిలో ఎక్కువగా యువత, టీనేజర్సే ఉంటారని ఆమె తెలిపారు. ఇతర వయసుల వారితో పోల్చుకుంటే యూత్, టీనేజర్స్లో కరోనా ఇన్ఫెక్షన్ వేగంగా తగ్గిపోతున్నా ఆందోళన వారిలోనే ఎక్కువగా ఉంటుందని మోగెన్సెన్ చెప్పారు.
స్టాక్హోమ్లో సగటు వయసు 22 ఏండ్లు ఉన్న యువతపై, అంటే.. 1994-1996 మధ్య జన్మించిన వారిపై తాజా అధ్యయనం చేశారు. కరోనా మహమ్మారి విస్తరణకు ముందు 2016 నుంచి 2019 వరకు ఈ పరిశోధన జరిగింది. పరిశోధనలో భాగంగా వారిపై రకరకాల పరీక్షలు చేశారు. తాజాగా వారిలోంచి కరోనా బారినపడి కోలుకున్న వారిని ఎంపిక చేసుకుని 2020, అక్టోబర్ నుంచి 2021, మే నెలల మధ్య ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలతోపాటు పలు రకాల పరీక్షలు చేశారు. మొత్తం 661 మందిపై పరిశోధన చేయగా అందరిలోనూ ఊపిరితిత్తుల పనితీరు మునుపటిలాగే ఉందని తేలింది. 178 మంది రక్తంలో సార్స్ కోవ్-2 వ్యతిరేక యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్లు గుర్తించారు.