Corona virus FAQs: కరోనా ఫస్ట్ వేవ్ జనాల్లో వణుకు పుట్టించింది. అది తగ్గి.. జనాలు కాస్త రిలాక్స్ అయ్యారో లేదో ఇప్పుడు సెకండ్ వేవ్ విరుచుకుపడింది !! ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది !! గతేడాది వచ్చిన కరోనా వేరియంట్ వృద్ధులపైనే ఎక్కువ ప్రభావం చూపగా.. ఇది చిన్నాపెద్దా లేకుండా అందర్నీ ఆడేసుకుంటుంది. దీంతో ప్రజల్లో భయాలు మరింత ఎక్కువయ్యాయి. ముఖ్యంగా జనాల మెదళ్లలో ఎన్నో అనుమానాలు !! మరెన్నో సందేహాలు తిరుగుతున్నాయి. అసలు సెకండ్ వేవ్కు ఫస్ట్ వేవ్కు తేడా ఏంటి. ? వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కరోనా సోకితే ఎలా? కరోనా వస్తే ఆస్పత్రుల్లో చేరాలా? ఇంటి దగ్గరే ఉంటే సరిపోదా? ఎలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరాలి? లక్షణాలు ఉన్నా కొంతమందికి నెగెటివ్ ఎందుకు వస్తుంది? ఇలా జనాల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు, కోఠి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో డీఎంఈ రమేశ్రెడ్డి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు కరోనాపై ప్రజల్లో ఉన్న పలు సందేహాల ( Corona virus FAQs )ను నివృత్తి చేశారు.
కరోనా ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్ చాలా ఉద్ధృతంగా ఉంది. మొదటి దానితో పోలిస్తే ఇప్పుడు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఫస్ట్వేవ్లో 45 ఏండ్లకుపైబడిన వారిపై ఎక్కువ ప్రభావం కనిపించింది. ఇప్పుడు పదేండ్లలోపు పిల్లలకూ వస్తున్నది. కరోనా నుంచి కోలుకున్నవారిలోనూ పోస్ట్కొవిడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటున్నది.
జ్వరం, దగ్గు, జలుబు, కండ్లలో మంటలు, ఎర్రబడటం, ఒంటి నొప్పులు, తలనొప్పి, విరేచనాలు, వాసన, రుచి తగ్గడం వంటి లక్షణాలు ఉంటేనే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు అవసరం. సాధారణ ఫ్లూ లక్షణాలు ఒకట్రెండు రోజులు ఉంటాయి. అయినా తగ్గకుంటే కొవిడ్గా అనుమానించి పరీక్షలు చేయించుకోవాలి.
కొందరు అనుమానంతో వారానికి రెండు, మూడుసార్లు పరీక్షలు చేయించుకుంటున్నారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా పరీక్షా కేంద్రానికి వెళ్తున్నారు. వీటి వల్ల నిజంగా పరీక్షలు అవసరమైనవారు నష్టపోతున్నారు. అంతేకాకుండా పరీక్షల కోసం వెళ్లి కొంతమంది అక్కడే వైరస్ బారిన పడుతున్నారు.
కరోనా లక్షణాలున్నవారు మాత్రమే యాంటిజెన్ చేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ దాంట్లో తేలనట్టు అనిపిస్తే ఆర్టీ-పీసీఆర్ చేయించుకోవాలి. ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ వచ్చినా కొంతమందిలో లక్షణాలుంటున్నాయి. ఇలాంటివాళ్లు మాత్రమే డాక్టర్ సలహాతో సీటీ స్కాన్ చేయించుకోవాలి. ఇటీవల చాలామంది డాక్టర్ల సలహా తీసుకోకుండానే సీటీ స్కాన్ చేయించుకుంటున్నారు. దీనివల్ల రేడియేషన్ ప్రభావానికి గురవుతారు. దీంతోపాటు నిజంగా కరోనా వచ్చిన వారికి సకాలంలో రిపోర్టులు అందవు. ఇది కూడా వనరుల దుర్వినియోగమే.
కరోనా నిర్ధారణ అయిన మరుక్షణం నుంచే ఐసొలేషన్లోకి వెళ్లాలి. లేకపోతే ఒక రోగి ద్వారా సగటున పదిరోజుల్లో 140 మందికి వైరస్ సోకే ప్రమాదం ఉన్నది. డయాబెటిస్, బీపీ, గుండెజబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్, హెచ్ఐవీ తదితర వ్యాధులున్నవారు కరోనా సోకినపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివారు వైద్యులను సంప్రదించి దవాఖానలో చేరితే మంచిది. ఇక లక్షణాలు లేనివారు, చాలా తక్కువ లక్షణాలున్నవారు ఇంట్లోనే పల్స్ ఆక్సీమీటర్ ద్వారా తమ ఆక్సిజన్ లెవల్స్ను చూసుకోవాలి. 95 కన్నా తక్కువైన పక్షంలో వెంటనే హాస్పిటల్లో చేరాలి. వీరికి ఆక్సిజన్ సపోర్టు అవసరమవుతుంది. ఆస్తమా, శ్వాసకోశ రుగ్మతలు ఉన్నవారిలో ఆక్సిజన్ లెవల్ 92 వరకు ఉన్నా ఫర్వాలేదు. నిజానికి 85-90% మందికి దవాఖానలో అడ్మిషన్ అవసరం లేదు. కరోనా బారినపడ్డ వారిలో రాష్ట్రంలో 99% మంది కోలుకుంటున్నారని గుర్తుంచుకోవాలి.
లక్షణాలు తీవ్రంగా ఉంటే 108కి ఫోన్చేయాలి. 450 అంబులెన్స్లు, కరోనా కోసం ప్రత్యేకంగా 150 అంబులెన్సులు సేవలందిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో పడకల వివరాలు అంబులెన్స్ పైలట్ వద్ద ఉంటాయి. బాధితులు సూచించిన హాస్పిటల్లో పడకలు లేకుంటే వెంటనే పైలట్ సూచన మేరకు సమీప దవాఖానలో చేరొచ్చు.
కరోనా వచ్చినపుడు హోం ఐసోలేషన్లో ఉన్నా, ఆస్పత్రిలో ఉన్నా రోగి రెగ్యులర్గా వాడే అన్ని మందులను నిరభ్యంతరంగా వాడవచ్చు. చాలామంది కరోనా రావడంతో రెగ్యులర్గా వాడే బీపీ, షుగర్, క్యాన్సర్, కిడ్నీ తదితర వ్యాధుల మందులను ఆపేస్తున్నారు. ఇలా చేస్తే సమస్య మరింత జటిలం అవుతుంది. ప్రాణాంతకం కూడా కావొచ్చు.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా మార్గదర్శకాలు పాటించాల్సిందే. లేకపోతే కరోనా వచ్చే అవకాశం ఉంటుంది. టీకా తీసుకున్న తర్వాత కూడా కరోనా వచ్చే అవకాశం 20 శాతం వరకు ఉంటుందని ఆయా కంపెనీలే స్పష్టం చేసుకున్నాయి. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకితే స్వల్ప లక్షణాలతోనే బయటపడుతున్నారు. రెండు డోసులు తీసుకున్న 80 ఏండ్లు పైబడిన వారిలో ఎవరూ ఇప్పటివరకు తీవ్ర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరలేదు.
రెమ్డెసివిర్ తీసుకుంటే కొవిడ్ పోతుందనేది అపోహ. ఇప్పటికీ అది ఇన్వెస్టిగేటివ్ డ్రగ్ మాత్రమే. కాకుంటే ఇది వైరల్ లోడ్ను కొంత తగ్గిస్తుంది. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం, ఎవరికైతే సాచురేషన్ లెవల్ 92 కిందికి పడిపోతుందో.. తీవ్ర శ్వాస ఇబ్బందులు తలెత్తుతాయో వారికే ఈ మందు వాడాలి. ప్రజల్లో అపోహ, కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల అతి ప్రచారం వల్ల రెమ్డెసివిర్ కృత్రిమ కొరత, దుర్వినియోగం మొదలైంది. అవసరమైన ప్రతి ఔషధం ప్రభుత్వ దవాఖానల్లో నిండుగా ఉన్నది.
వైరస్లు ఏవైనా సరే వేగంగానే వ్యాపిస్తాయి. కరోనా ప్రత్యేకమైంది. ఇది చాలావేగంగా వ్యాపిస్తున్నది. అంతే వేగంగా తగ్గే అవకాశం ఉన్నది. టీబీ వంటివి చాలా నిదానంగా వ్యాపిస్తాయి. కరోనా వేగంగా తగ్గుతుందన్న ధీమాతో ఉండవద్దు. మన జాగ్రత్తలే మనకు రక్ష. ప్రతిఒక్కరూ ప్రభుత్వ నిబంధనలను, వైద్యుల సూచనలను పాటించాలి.
కరోనా వచ్చిన వాళ్లు మాంసం, కూరగాయలు తినవచ్చు. వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు, పండ్ల రసాలు తీసుకోవాలి. మజ్జిగ, పండ్ల రసాలతో జలుబు చేస్తుందని కొంతమంది వీటికి దూరంగా ఉంటున్నారు. ఇది సరికాదు. వీలైనంత ఎక్కువగా పండ్ల రసాలు తీసుకుంటే మరీ మంచిది. కరోనాతో ఉన్నవారు ధైర్యం కోల్పోవద్దు.
కరోనా మందులపై అనేక అపోహలున్నా యి. ఫలానా మందు పనిచేస్తుందని నిర్ధారణతో చెప్పిన దాఖలాలు ఇప్పటివరకు ప్రపంచంలోనే లేవు. హైడ్రాక్సిక్లోరోక్విన్ అని.. ఇంకేదో అని వాడేస్తున్నారు. యాంటిబయాటిక్స్ కూడా విరివిగా వాడేస్తున్నారు. ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. విటమిన్ల మాత్రలను కూడా చాలామంది వేసుకుంటున్నారు. వీటివల్ల పెద్దగా ఉపయోగాలుండవు. ఇక ఆయుర్వేదం అని, హోమియో అని కూడా వాడుతున్నారు. కర్పూరం, అల్లం, శొంఠి వంటి పదార్థాలను వడగట్టి పీల్చితే పోతుందని కూడా వాట్సాప్లో ప్రచారం జరుగుతున్నది. దీనివల్ల కూడా కరోనా తగ్గదు. కరోనా అనేక రూపాంతరాలు చెందింది. అందరిపై ఒకేలా ప్రభావం చూపించడంలేదు. కరోనా సోకినవారు వైద్యులను సంప్రదించి మందులను వాడడం మంచిది. లేదంటే ఒక్కోసారి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.
ఎవరికి వాళ్లు ఆక్సిజన్ యంత్రాలను కొనుక్కోవడం, నిల్వ చేయడం సరికాదు. వైద్యుల పర్యవేక్షణలోనే ఆక్సిజన్ పెట్టుకోవాలి. ఆక్సిజన్ యంత్రాలను, సిలిండర్లు ఇంట్లో నిల్వ ఉంచుకోవడం వల్ల.. అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఉన్నవారి ప్రాణాలు తీసినవారవుతారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
కొవిడ్ సెకండ్ వేవ్ భిన్నం.. వచ్చే 4 వారాలు ఎందుకు కీలకమంటే..?
Corona effect : భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు
దేశంలో అందుబాటులోకి మరో టీకా.. జైడస్ క్యాడిలా టీకాకు డీసీజీఐ అనుమతి
మే మూడో వారంలో కరోనా మరింత ఉద్ధృతం: ఎస్బీఐ రిపోర్ట్
గుజరాత్ లో దారుణం : కొవిడ్ బెడ్ కోసం రూ 9000కు బేరం
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి