‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులే మిన్న’నానుడి తెలియనిది కాదు. అవసరమున్నపుడు ఒకలా..అవసరం లేనప్పుడు మరొకలా ప్రవర్తిస్తున్న రోజులివి. అత్యవసర సందర్భాల్లో అయినవారు కూడా దూరమవుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేమున్నామని ముందుకొచ్చి ఆదుకుంటున్నారు. సేవామూర్తులు. కరోనా ఆపత్కాలంలో అనేకమంది వివిధ రూపాల్లో అవస్థలు పడుతున్నారు. ఆక్సిజన్ దొరకక కొందరు..రక్తం అందక మరికొందరు..ప్లాస్మా కావాలని ఇంకొందరు.
ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో వ్యక్తులుగా, సంస్థలుగా సేవలందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. కరోనా సోకిన వారికి ఆహారం నుంచి ఆక్సిజన్ వరకు ఉచితంగానే అందిస్తున్నారు. ఉచిత క్యాబ్ సర్వీస్తోపాటు ఐసోలేషన్లో ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువై మరణించిన వారి అంత్యక్రియలకు కుటుంబసభ్యులు కూడా దూరంగా ఉంటుండడంతో అన్నీ తామై చివరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది మరో సేవా సంస్థ. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో వ్యక్తులు, సేవా సంస్థల చేయూతపై ప్రత్యేక కథనం..
“శివ అనే వ్యక్తి కరోనాతో బాధపడుతున్నాడు. అర్జెంటుగా ‘ఓ’ పాజిటివ్ ప్లాస్మా అవసరం పడింది. అందుకోసం వారి బంధువులు, స్నేహితులు అనేక ప్రయత్నాలు చేశారు. రూ.40వేలు ఇస్తే ప్లాస్మా సమకూర్చుతామని దవాఖాన వర్గాలు చెప్పాయి. అంత డబ్బు చెల్లించలేక చివరి ప్రయత్నంగా ఓ నంబర్కు ఫోన్ చేశారు. వెంటనే సదరు వ్యక్తి అతడికి ప్లాస్మా ఇచ్చి రక్షించాడు.” ఏ బంధమూ లేని తనకు ఉచితంగా ప్లాస్మా ఇచ్చి ఆదుకున్న ఆ వ్యక్తి పేరు వేణు.
“ రమేశ్ అనే వ్యక్తి దినసరికూలి. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న అతడికి కరోనా సోకడంతో కుటుంబమంతా తల్లడిల్లింది. తెలిసిన వారు ఓ నంబర్కు ఫోన్ చేసి అతడి వివరాలు అందించారు. ఇక ఆ రోజు నుంచి అతడి ఇంటికి భోజనం, మందులు వచ్చాయి. అవసరమైన సూచనలు అందుతున్నాయి. పేదవాడి గుండెలో దేవుడిగా నిలిచిన ఆ సంస్థ ‘హెల్పింగ్ హ్యాండ్”.
“అతడి పేరు విజేందర్. కరోనాతో మృతి చెందాడు. బంధువులు భయంతో అంత్యక్రియలు చేయడానికి ముందుకురాలేదు. దిక్కులేని శవంలా మిగిలిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అంత్యక్రియలు జరిపి ఉదారతను చాటుకుంది ‘ఫీడ్ ద నీడి సంస్థ’.
“ఆమె పేరు ప్రసన్న. 68 ఏండ్లు. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకున్నది. వృద్ధులకు సేవలందిస్తున్న వారి వివరాలు తెలుసుకున్నది. ఒక్క ఫోన్ చేసి చిరునామా చెప్పింది. అరగంటలో క్యాబ్ ఆమె ఇంటి ముందరకు వచ్చి ఆగింది. వ్యాక్సిన్ సెంటర్కు తీసుకువెళ్లి.. పూర్తయ్యాక తిరిగి ఇంటికి చేర్చింది.’ ఈ ఉచిత సేవలందిస్తున్న సంస్థ ‘హెల్పేజ్ ఇండియా”
వీళ్లంతా కనిపించే దేవుళ్లు.. ఒక్క ఫోన్ కొడితే చాలు వెంటనే వాలిపోతున్నారు. కరోనా కష్ట కాలంలో నా అనే వారు ఎవరూ దగ్గరకు రాకున్నా.. మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. ఏ అవసరమైనా.. తీర్చేస్తున్నారు. దీంతో సాయం పొందిన వారు దేవుళ్లుగా భావిస్తున్నారు. రెండు చేతులెత్తి దండం పెడుతున్నారు.
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఆలోచన కొందరిలోనే ఉంటుంది. అలాంటి వారికి రాజధానిలో కొదువ లేదు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సాయం కోసం ఎదురుచూసే వారికి దన్నుగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ భరోసానిస్తున్నారు. వ్యక్తులుగా, సంస్థలుగా సేవలందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ఆహారం నుంచి ఆక్సిజన్ వరకు ఉచితంగానే అందిస్తున్నారు. ఒక్క కాల్ చేస్తే చాలు సేవలు మీ ముందర వాలుతాయి. క్లిష్ట పరిస్థితుల్లో అన్ని రంగాల నుంచి ఆపద్బాంధవులు సేవ చేయడానికి ముందుకువస్తున్నారు.
ప్లాస్మా, రక్తం అవసరమున్న వారికి వీలైనంత వరకు అందిస్తున్నాం. వంద మందితో టీంగా ఏర్పడ్డాం. ఇప్పటి వరకు 70 మందికి ప్లాస్మా దానమిచ్చాం. అనేక దవాఖానల్లో వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలే కరోనాతో పోరాడుతున్న వాళ్లు అంత డబ్బు ఇచ్చుకోగలరా? అలాంటివారికి మేమంతా అండగా నిలవాలనుకున్నాం. మాకు ఫోన్ చేస్తే వీలైనంతలో సదరు వ్యక్తిని సంబంధిత దవాఖానకు పంపిస్తాం. – వేణు, రక్త దాత.
అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేక చాలా మంది శవాలను తీసుకువెళ్లడం లేదు. మరికొందరు కరోనా భయంతో రావడం లేదు. అలాంటి వారు మాకు ఫోన్ చేసి అంత్యక్రియలు చేయండి అంటూ అడుగుతున్నారు. భయానక రోజులు వచ్చాయి. వారి బాధను అర్థం చేసుకుని లాస్ట్ రైడ్ పేరుతో మేమే అంత్యక్రియలు జరుపుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాయం అందించాలి. – శ్రీనివాస్ బెల్లం, లాస్ట్ రైడ్ నిర్వాహకులు.
వృద్ధులను క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. వారికి వ్యాక్సిన్ వేయించాలి. అందుకే వారికోసం మేం క్యాబ్ సర్వీస్ను ఉచితంగా అందిస్తున్నాం. వ్యాక్సిన్ అయ్యాక ఇంటికి తీసుకువెళ్లే బాధ్యత కూడా మాదే. రోజుకు 60కి పైగా కాల్స్ వస్తున్నాయి. టీకా వేయించుకునే వృద్ధులకు మాత్రమే ఈ సర్వీస్ను అందిస్తున్నాం.- కళాధర్, హెల్పేజ్ ఇండియా ఎల్డర్ హెల్ప్లైన్ కో ఆర్డినేటర్.