శ్రీశైలం : శ్రీశైల మల్లన్నకు పరమ భక్తురాలైన మల్లమ్మ జయంత్యుత్సవాన్ని బుధవారం నిరాడంబరంగా నిర్వహించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా హేమారెడ్డి మల్లమ్మ మందిరంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ఈఓ దంపతులు నూతన వస్త్రాలు, పసుపు కుంకుమ, సారె సమర్పించారు.
రుత్వీగులు జయంత్యుత్సవ మహా సంకల్పం పఠింపచేసి స్తోత్ర పారాయణలతో అభిషేకం జరిపించారు. అనంతరం ఉమామహేశ్వర స్వామివారికి పూజలు చేశారు. వీరశైవ సాంప్రదాయం కలిగిన మల్లమ్మ సంసార జీవితం వదిలి శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జునుడి సేవలో ఉంటూ భక్తులకు శివతత్వాన్ని బోధిస్తూ సాయుజ్యం పొందిన మహా భక్తురాలు అని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.