హైదరాబాద్, ఏప్రిల్ 20, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు రాత్రి 8 గంటలకే బంద్ కానున్నాయి. బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, కల్లు దుకాణాలు సైతం 8 గంటలకే మూతపడనున్నాయి. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. బార్లు, క్లబ్బులకు పలు నిబంధనలు విధించారు.
బార్లు, క్లబ్బుల ప్రవేశద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. సిబ్బంది తప్పక మాస్కులు ధరించాలి. బార్లు, క్లబ్బుల్లో డ్యాన్స్ఫ్లోర్లు, మ్యూజికల్ ఈవెంట్లపై నిషేధం. భౌతికదూరం, క్యూలైన్లు తప్పక పాటించాలి. పరిసరాలను రోజుకు రెండుసార్లు శానిటైజే చేయాలి. సరైన గాలి వెలుతురు ఉండేలా చూడాలి. బార్ కౌంటర్ల వద్ద లిక్కర్ సర్వీస్ నిలిపివేయాలి.
రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో అన్ని బస్సులను రాత్రి 9 గంటల వరకు గమ్యస్థానాలకు చేరేలా ఆర్టీసీ చర్యలు తీసుకుంటున్నది. జిల్లాల నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు, హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సులన్నీ రాత్రి 9 గంటలకు గమ్యస్థానాలకు చేరేలా ప్రణాళిక వేసుకున్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. హైదరాబాద్లో సిటీ బస్సులు కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలలోపే అందుబాటులో ఉంటాయని చెప్పారు.