హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ దార్శనికత, స్ఫూర్తితోనే తెలంగాణను సాధించామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. కుల వివక్షకు తావులేకుండా అత్యున్నత విలువలతో కూడిన లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామికదేశంగా భారత్ను తీర్చిదిద్దేందుకు అంబేద్కర్ సూచించిన కార్యాచరణ మహోన్నతమైనదని కొనియాడారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ ఘనంగా నివాళి అర్పించారు. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. భీంరావ్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం సబ్బండవర్గాలకు సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నదని గుర్తుచేశారు. గ్రామీణ ఆర్ధికవ్యవస్థను పరిపుష్టంచేసేందుకు ప్రాధాన్యతాక్రమంలో అమలుచేస్తున్న ఆర్ధిక సామాజిక విధానాల్లో బాబాసాహెబ్ ఆశయాలు ఇమిడి ఉన్నాయని పేర్కొన్నారు.
సత్పలితాలిస్తున్న టీఎస్ ప్రైడ్ దళితుల అభివృద్ధికోసం వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్రత్యేక ప్రగతినిధి (ఎస్సీ సబ్ప్లాన్) చట్టం ఏర్పాటుచేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అమలుచేస్తున్న టీఎస్ ప్రైడ్ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నదని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పే దళిత పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలు ఇస్తున్నదని, మార్కెట్ కమిటీల్లో కాంట్రాక్టు పనుల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గురుకులాలు సాధిస్తున్న అద్భుత విజయాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇతర అనుబంధ రంగాల్లోనూ దళితుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నదని తెలిపారు. ప్రపంచంతో పోటీపడుతూ రాష్ట్రంలో దళిత, గిరిజన బిడ్డలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత శిఖరాలు అధిరోహించడాన్ని యావత్ ప్రపంచం ప్రశంసిస్తున్నదని హర్షం వ్యక్తంచేశారు. విద్యానిధి ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్యనందిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా కుల రహిత సమాజానికి బాటలు వేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.