లండన్ : ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్పై యూకే ప్రభుత్వానికి వ్యాక్సినేషన్ సలహా కమిటీ కీలక సూచనలు చేసింది. టీకా తీసుకున్న వారిలో అరుదుగా రక్తం గడ్డకట్టడంతో దేశంలో ఇప్పటి వరకు 19 మంది మరణించారు. ఈ క్రమంలో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్కు బదులుగా ప్రత్యామ్నాయంగా మరో టీకా ఇవ్వాలని సూచించింది. ఇప్పటి వరకు యూకే వ్యాప్తంగా 79 మందిలో రక్తం గడ్డ కట్టింది. 18-29 ఏళ్ల వయస్సు పెద్దలకు మరో టీకా ఇవ్వాలని చెప్పినట్లు వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యూనైజేషన్ జాయింట్ కమిటీకి చెందిన వీ షెన్ లిమ్ పేర్కొన్నారు.
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ‘కొవిషీల్డ్’ పేరుతో తయారు చేస్తోంది. ఈ ఏడాదిలో భారత ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదించిన రెండు వ్యాక్సిన్లలో ఇదీ ఒకటి. ఫార్మా మేజర్ సహకారంతో వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం.. వ్యాక్సిన్, రక్తం గడ్డ కట్టేందుకు మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్, రక్త గడ్డకట్టడం మధ్య ఉన్న ‘సాధ్యమైన లింక్’ను కనుగొన్నట్లు యూరోపియన్ ఔషధ నియంత్రణ సంస్థ చెప్పిన కొద్ది గంటల్లోనే కమిటీ సూచనలు చేసింది. అయితే ఎలాంటి కొత్త ఆంక్షలు సిఫారసు చేయలేదు. టీకా ప్రయోజనాలు ఇప్పటికీ ప్రమాదాలను మించి ఉన్నాయని చెప్పింది.
గత నెల చివరి నాటికి 20 మిలియన్లకుపైగా మోతాదులు ఇవ్వబడ్డాయి. ఇప్పటి వరకు రక్తం గడ్డ కట్టిన కేసులు 79 నమోదవగా.. ఇందులో 19 మంది మరణించారని మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ఉత్పత్తుల రెగ్యులేటరీ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూన్ రైన్ పేర్కొన్నారు. మార్చిలో, ఐర్లాండ్, డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్ అధికారులు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేయగా.. భారత్లో మాత్రం కొనసాగుతోంది. నేషనల్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ డాక్టర్ వీకే పాల్ ‘ఇతర దేశాల్లో రక్తం గడ్డకట్టే ఆందోళనలు ఉన్నాయన్నారు. దేశంలో తనిఖీ చేశామని, నిపుణులు ఎలాంటి సమస్యను కనుగొనలేదన్నారు. భారతదేశంలో వ్యాక్సినేషన్ కోసం కొవిషీల్డ్ ఉపయోగించడం కొనసాగిస్తామన్నారు.