రియో డీ జనీరో: బ్రెజిల్లో కరోనా మహమ్మారి మరణ మృదంగం కొనసాగుతున్నది. అక్కడ ప్రతిరోజు వేలల్లో కరోనా చావులు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే బ్రెజిల్లో 3,650 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం వెల్లడించింది. దేశంలో ఒకేరోజు మూడు వేలకు పైగా కరోనా మరణాలు సంభవించడం ఇది రెండోసారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
గత మంగళవారం (ఈ నెల 23న) కూడా బ్రెజిల్లో 3,251 మంది కరోనా బాధితులు మృతిచెందారు. ఇవాళ్టి మరణాలతో కలిపి బ్రెజిల్లో మొత్తం కరోనా చావుల సంఖ్య 3,07,112కు చేరింది. గడిచిన 24 గంటల్లో 84,245 కొత్త కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,04,414కు చేరింది. గురువారం అత్యధికంగా 1,00,158 కొత్త కేసులు నమోదయ్యాయి.