డయాబెటిస్.. నేటి తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఇది భయపెడుతున్నది. టైప్-1, టైప్-2 పేరిట రెండు రకాలుగా మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. మన దేశంలో 2030 వరకు 7.94 కోట్ల మంది డయాబెటిస్ బాధితులు ఉంటారని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే డయాబెటిస్ రాకుండా చూసుకోవడం ఇప్పుడు అందరి చేతుల్లోనూ ఉంది. అయితే ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడిన వారు కింద సూచించిన విధంగా పలు ఆయుర్వేద సూచనలు పాటిస్తే దాంతో షుగర్ వ్యాధిని అదుపు చేయవచ్చు. దీని వల్ల వారి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. మరి ఆ సూచనలను ఇప్పుడు తెలుసుకుందామా..!
1. గోరు వెచ్చని నీళ్లలో గానీ లేదా పాలలో గానీ పసుపును కలిపి రోజూ తాగాలి. డయాబెటిస్ను అదుపు చేయడంలో పసుపు అమోఘమైన పాత్ర పోషిస్తుంది.
2. రాత్రి పూట రాగి పాత్రలో నీటిని పోసి వాటిని రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని పరగడుపునే తాగాలి. ఇలా చేయడం వల్ల ఆయుర్వేద ప్రకారం శరీరంలో వాత, పిత్త, కఫాలనే దోషాలు సమతుల్యం అవుతాయి. షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
3. రాత్రి పూట కొన్ని మెంతులను నీటిలో నానబెట్టి రాత్రంతా వాటిని నీటిలో అలాగే ఉంచి ఉదయాన్నే పరగడుపునే ఆ మెంతులను తిని ఆ నీటిని తాగాలి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
4. తీపి పదార్థాలకు బదులుగా, చేదు, వగరు ఉండే ఆహారాలను తీసుకుంటే డయాబెటిస్ను అదుపు చేయవచ్చు. కాకరకాయ, నేరేడు, అలోవెరా, ఉసిరికాయ జ్యూస్లను తాగుతుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
5. నిత్యం మనం వంటల్లో వేసే ఇంగువ, దాల్చిన చెక్క, ఆవాలు, ధనియాలు, లవంగాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. అవి డయాబెటిస్ను అదుపు చేస్తాయి.