వెంకటాద్రి చెరువును ముద్దాడిన జలాలు
ఎగువమానేరు నుంచి పరవళ్లు
సంబురపడుతున్న రైతులు
గంభీరావుపేట, ఏప్రిల్ 2: కాళేశ్వర గంగ తరలివస్తున్నది. కోటి ఎకరాల మాగాణి లక్ష్యంగా మెట్ట ప్రాంతానికి జలాలు ఎత్తిపోసి ఈ రైతుల పాదాలను గోదారి జలాలతో కడుగుతామని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కూడవెల్లి వాగు నుంచి ఎగువమానేరుకు పరవళ్లు తొక్కిన జలాలు, ఎడమకాలువ ద్వారా గంభీరావుపేట మండల కేంద్రంలోని మెట్ట ప్రాంతానికి పరుగులు తీశాయి. వెంకటాద్రి చెరువును శుక్రవారం ముద్దాడగా, రైతులు సంబురపడుతున్నారు.
మానేరు ఎడమ కాలువ ద్వారా జలాలు
సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగు ద్వారా కాళేశ్వర జలాలు ఐదురోజులుగా ఎగువ మానేరుకు వస్తున్నాయి. మానేరులో పూర్తి స్థాయి నీటి మట్టం 31 అడుగులకు గాను ప్రస్తుత 25 అడుగులకు చేరింది. అయితే మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు మానేరు ఎడమ కాలువ ద్వారా మండల కేంద్రంలోని వెంకటాద్రి చెరువుకు శుక్రవారం నీళ్లు వదిలారు. దీంతో ఆయకట్టు రైతులు సంబుర పడుతున్నారు. చెరువులు అడుగంటుతున్న సమయంలో వెంకటాద్రి చెరువుకు కాళేశ్వర జలాలు రావడం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.