హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారిన ఔటర్ రింగ్ రోడ్డును సరికొత్తగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టింది. 12 ఏండ్ల కిత్రం మొదటిసారిగా ప్రారంభమైన గచ్చిబౌలి-శంషాబాద్ మార్గానికి పూర్తిస్థాయిలో తిరిగి తారు రోడ్డు వేయనున్నారు. ఇందుకోసం సుమారు 63 కోట్ల వ్యయంతో 8 లైన్లతో కూడిన ప్రధాన రహదారి (8లేన్ల మెయిన్ క్యారేజ్వే)ని దశల వారీగా అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించనున్నారు. గంటలకు 120 కి.మీ వేగం లక్ష్యంతో నిర్మించిన ఔటర్పై ప్రస్తుతం 100 కి.మీ వేగాన్ని నిర్దేశించారు. ఒక్కో వైపు 4 వరుసలుగా ఉన్న ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా దశల వారీగా 3నెలల్లోనే రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదట రెండు వరుసల్లో తారు రోడ్డును వేస్తూ మిగతా రెండు వరసల్లో ట్రాఫిక్ను అనుమతిస్తారు. ఆ సమయంలో వేగాన్ని అవసరం మేరకు నియంత్రిస్తూ పనులు నిర్వహిస్తారని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. రోడ్డు నిర్మాణం చేపట్టే ముందు డిప్లెక్టో మీటర్తో రోడ్డుపై పడుతున్న భారాన్ని పరీక్షించిన తర్వాత దానికి అనుగుణంగా బీటీ రోడ్డును వేయనున్నారు.
హైదరాబాద్ మహానగరం నుంచి ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానించే మార్గం గచ్చిబౌలి నుంచి ప్రారంభమవుతుంది. ఓఆర్ఆర్ ప్రాజెక్టులో భాగంగా నగరంలో 158కి.మీ పొడవునా రోడ్డు నిర్మించారు. ఇందులో గచ్చిబౌలి-శంషాబాద్ మార్గం 12ఏండ్ల కిత్రం అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఓఆర్ఆర్పై రోజూ ఉండే ట్రాఫిక్ రద్దీలో అధిక భాగం సుమారు 25 కి.మీ ఉన్న గచ్చిబౌలి-శంషాబాద్ మార్గంలోనే ఉంటోంది. ఇందుకు ప్రధాన కారణం శంషాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటమే. ఐటీ కారిడార్ నుంచి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, పటాన్చెరు, మియాపూర్ ప్రాంతాల నుంచి విమానాశ్రయం వెళ్లేందుకు ఇదే అత్యంత అనుకూలమైన మార్గం కావడంతో నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఈమార్గంలోఅక్కడక్కడ రోడ్డు దెబ్బతిన్నది. తరచూ మరమ్మతులు చేసినా మళ్లీ రోడ్డు దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో రోడ్డును పూర్తిగా కొత్తగా వేయాలనే నిర్ణయంతో టెండర్లు పిలిచారు. వాహనాలు ఎలాంటి కుదుపులు లేకుండా సాఫీగా వెళ్లేందుకు వీలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్డు పునర్నిర్మాణం ఉంటుందని అధికారులు తెలిపారు.