మూడు ఐపీఎల్ టైటిళ్లు.. ప్రతి సీజన్లో నాకౌట్ చేరిన రికార్డు.. అయితే గతేడాది సీన్ మారిపోయింది. ఊహాతీతంగా చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా విఫలమైంది. రైనా, హర్భజన్ సింగ్ దూరమవడం, సీనియర్ ఆటగాళ్లు రాణించలేకపోవడంతో చతికిలపడి పాయింట్ల పట్టికలో ధోనీసేన ఏడో స్థానానికి పరిమితమైంది. యూఏఈలో జరిగిన ఆ సీజన్ను మరిపిస్తూ ఈ ఏడాది మళ్లీ గర్జించాలని చెన్నై కంకణం కట్టుకుంది. ఆ ప్రణాళికల్లో భాగంగానే ఎంతో ముందుగానే ఆటగాళ్లకు ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించింది. వేలంలో మొయిన్ అలీ లాంటి కీలకమైన ప్లేయర్లను తీసుకుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేయండి..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మళ్లీ ఆధిపత్యం చెలాయించాలనే లక్ష్యంతో 14వ సీజన్కు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సమాయత్తమవుతున్నది. కరోనా వైరస్ ఆందోళన వల్ల యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్లో ఏడో స్థానానికి పరిమితమై.. టోర్నీ చరిత్రలో తొలిసారి నాకౌట్ చేరలేకపోయింది. జట్టులో కొవిడ్-19 కలకలం, ఆ తర్వాత నాటకీయంగా ప్రధాన బ్యాట్స్మన్ సురేశ్ రైనా నిష్క్రమణ, స్టార్ ఆటగాళ్లు విఫలమవడం ఇలా అనేక కారణాలతో ధోనీసేన సత్తాచాటలేకపోయింది. అయితే రైనా తిరిగిరావడం, మొయిన్ అలీ లాంటి నిఖార్సైన ఆల్రౌండర్ను తీసుకోవడం, సామ్ కరన్ సూపర్ ఫామ్తో ఈ ఏడాది ఐపీఎల్లో రెచ్చిపోతామని సీఎస్కే ధీమాతో ఉంది. పాత వైభవాన్ని చూపించాలని పట్టుదలతో కనిపిస్తున్నది. క్లిష్ట సమయాల్లో సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించగల మహేం ద్ర సింగ్ ధోనీ సారథిగా ఉండడంతో చెన్నై శిబిరంలో మనోధైర్యానికి ఎలాంటి కొదువ ఉండదని చెప్పవచ్చు. ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్ తో చెన్నై టైటిల్ వేట ప్రారంభించనుంది.
14వ సీజన్కు ముందు చెన్నైకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆ జట్టు పేసర్, ఆస్ట్రేలియా ఆటగాడు హాజిల్వుడ్ ప్రకటించాడు. వివిధ సిరీస్లు, లీగ్ల కోసం 10 నెలలుగా బయోబబుల్లోనే ఉంటున్నానని, అందుకే క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నట్టు అతడు చెప్పాడు. అలాగే ఈ ఏడాది జరిగే యాషెస్, టీ20 ప్రపంచకప్నకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండేందుకు ఈ విశ్రాంతి తనకు ఉపయోగపడుతుందని హాజిల్ అన్నాడు.
భారత టెస్టు స్పెషలిస్టు చతేశ్వర్ పుజారను వేలంలో కొనుగోలు చేసి చెన్నై ఆశ్చర్యపరిచింది. దాదాపు ఆరేండ్లుగా లీగ్ ఆడని పుజ్జీని ఎంపిక చేసుకొని.. తమ వద్ద ప్రత్యేక ప్రణాళిక ఉందని చాటింది. అయితే సీఎస్కే తుది జట్టులో పుజారకు చోటు దొరుకుతుందా అన్నదే ప్రశ్నగా మారింది. వన్డౌన్లో రైనా రావడం కచ్చితం కాగా.. మిడిలార్డర్లోనూ ఖాళీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పుజారను ధోనీ ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.