రాంచీ : జార్ఖండ్లో దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ధన్బాద్లోని ప్రభుత్వ దవాఖానలో మానసిక వికలాంగురాలిపై అంబులెన్స్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. యువతిపై దారుణానికి పాల్పడటంలో అంబులెన్స్ డ్రైవర్కు టీస్టాల్ యజమాని సహకరించినట్టు వెల్లడైంది. మూగ, మానసిక వైకల్యంతో బాధపడుతన్న యువతిని జూన్ 26న కొందరు దవాఖానలో చేర్పించారు.
యువతిపై కన్నేసిన అంబులెన్స్ డ్రైవర్ సంజయ్ దాస్, టీస్టాల్ యజమాని కిషన్లు ఆదివారం రాత్రి దవాఖానలోని మహిళల వార్డులోకి ప్రవేశించి బాదితురాలిని నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లారు. ఆపై అంబులెన్స్ డ్రైవర్ సంజయ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దవాఖాన సిబ్బంది ఈ విషయం పసిగట్టి మహిళను కాపాడేందుకు ఘటనా ప్రాంతానికి వెళ్లగా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
నిందితుడికి సహకరించిన టీస్టాల్ యజమానిని వారు నిర్బంధించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చిన దవాఖాన సూపరింటెండెంట్ ఈ ఉదంతంపై దర్యాప్తు జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. నిందితుడు సంజయ్కు సహకరించిన టీస్టాల్ యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.