న్యూఢిల్లీ, మే 22: ఈ ఏడాది 12వ తరగతి బోర్డు పరీక్షలను రెండు దఫాలుగా నిర్వహించాలని సీబీఎస్ఈ ప్రతిపాదించింది. మొదట కరోనా కేసులు తక్కువగా ఉన్న అనుకూలమైన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించి, తరువాత దశలో మిగిలిన ప్రాంతాల్లో ఎగ్జామ్స్ నిర్వహించాలని సూచించింది. ఎవరైనా విద్యార్థి కొవిడ్ కారణంగా పరీక్ష రాయలేకపోతే వారికి మరో అవకాశం కల్పించాలని తెలిపింది. 12వ తరగతి పరీక్షలను, వివిధ ప్రవేశపరీక్షలను ఎలా నిర్వహించాలన్నదానిపై కేంద్ర విద్యాశాఖ ప్రతిపాదనలు కోరిన నేపథ్యంలో సీబీఎస్ఈ ఈ సూచనలు చేసింది. ‘పరీక్ష సమయాన్ని ఇప్పుడున్న మూడు గంటలకు బదులుగా గంటన్నరకు కుదించాలి. సిలబస్ను తగ్గించాలి.
సబ్జెక్టుల సంఖ్యను తగ్గించాలి. ఆరు సబ్జెక్టులకు బదులుగా లాంగ్వేజ్ పేపర్తో పాటు ముఖ్యమైన మూడు ఎలక్టివ్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలి’ అని కోరింది. ఇదిలా ఉండగా, 12వ తరగతి బోర్డు పరీక్షలు, ప్రవేశ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకొనేందుకు ఆదివారం కేంద్ర విద్యాశాఖ కీలక సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలని అన్ని రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులు, పరీక్షల బోర్డుల చైర్మన్లను కేంద్రం కోరింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలకు లేఖ రాసింది.