కనిపించిన నెలవంక
కొవిడ్,లాక్డౌన్ నేపథ్యంలో సామూహిక ప్రార్థనలు, అలాయ్ బలాయ్ బంద్
ఇండ్లల్లోనే జరుపుకోవాలని మతపెద్దలు, అధికారుల సూచన
దండేపల్లి, మే 13 : కొవిడ్ సెకండ్ వేవ్ మధ్య ముస్లింల 30 రో జుల ఉపవాస దీక్షలు ముగిశాయి. షవ్వాల్ మాసంలోని మొదటి రోజున జరుపుకునే పండుగ ఈద్-ఉల్-ఫితర్. గురువారం సా యంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో శుక్రవారం పండు గ జరుపుకోవాలని మత గురువులు ప్రకటించారు. యేటా ప్రత్యేక ప్రార్థనల కోసం ఈద్గాల వద్ద ఏర్పాట్లు చేయగా, ఈ యేడాది కరో నా, లాక్డౌన్ నేపథ్యంలో ఇండ్లల్లోనే ప్రార్థనలు చేయాలని మత పెద్దలు, అధికారులు సూచిస్తున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నమస్తే ప్రత్యేక కథనం..
ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్. విద్య ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి ఈ మాసంలోనే వచ్చింది. ఈ నెలలో ఉపవాస దీక్ష ద్వారా శరీరాన్ని శుష్కింపజేయడం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుంది. తద్వారా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు అదుపులో ఉంటాయి. రంజాన్ మాసంలో ముస్లిం లు ఉపవాసం ఉంటారు. ఉదయాన్నే అన్న పానాదులు సేవించడాన్ని సహర్ అని, సాయంత్రం ఉపవాస దీక్ష విరమించి భోజనం చేయడాన్ని ఇఫ్తార్ అని అంటారు.
ఈద్-ఉల్-ఫితర్ అంటే..
నెల పాటు ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలు అనంతరం షవ్వాల్ మాసపు మొదటి రోజున జరుపుకునే పండుగ ఈద్-ఉల్-ఫితర్. ఈ రోజు ఉదయాన్నే తలంటూ స్నానాలు చేసి, నూతన వస్ర్తాలు ధరించి, ఇతర్(అత్తరు) పూసుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పండుగ తర్వాత మరో ఆరు రోజుల పాటు షవ్వాల్ దీక్షలు పాటిస్తారు.
జకాత్..
ఇస్లాం నిర్దేశించిన సిద్దాంతాల్లో జకాత్ ఒకటి. జకాత్ అనగా దానం. ఇది మానవుల్లో త్యాగం, సానుభూతి, సహాకారాలను పెంచుతుంది.ప్రతి ఒక్కరూ తమకున్న దానిలోనే అవసరమున్న వారికి ఎంతో కొంత ఇచ్చి ఆదుకోవాలి. తమ వద్ద ఉన్న బంగారం, వెండి, రొక్కం, ఈ యేడు పండించిన పంట, వ్యాపారం కోసం నిర్దేశించిన సరుకులు, చివరికి తమ వద్ద ఉన్న పశువులను వెల కట్టి అందులో నుంచి 2.5 శాతం విధిగా దానం చేయాల్సి ఉంటుంది. నిరుపేదలు కూడా ఆనందోత్సవాలతో పండుగ జరుపుకోవాలన్నదే జకాత్, ఫిత్రాల ముఖ్య ఉద్దేశం.
ఫిత్రా దానం..
షవ్వాల్ నెల మొదటి తేదీ ఈద్-ఉల్-ఫితర్ పండుగ నాడు ప్రత్యేక ప్రార్థనలకు ముందు పేదలకు ఇచ్చే దానమే ఫిత్రా. అందుకే ఈ పండుగను ఈద్-ఉల్-ఫితర్ అంటారు. షరియత్ పరిభాషలో ఫిత్రా అంటే ఉపవాసాల పాటింపులో మనిషి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు, లోపాలు జరుగుతూనే ఉంటాయి. ఈ లోపాల పరిహారార్థం చేసేదే ఫిత్రా దానం. సమాజంలోని నిరుపేదలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు కూడా ఇతరులతో పాటు పండుగలో మంచి వస్ర్తాలు ధరించి మంచి వంటకాలు ఆరగించే వీలు కల్పిస్తుంది. పావు తక్కువ రెండు సేర్ల గోధుమలు తూకానికి సరిపడా పైకాన్ని కడు నిరుపేదలకు దైవం పేరిట ప్రతి ముస్లింలు దానం చేయాలి.
అలయ్ బలయ్బంద్..
కరోనా వైరస్ కారణంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇమామ్ ఇచ్చే సందేశాన్ని (ఖుత్బా) వినే అవకాశం, వేడుకోలు(దువా), ఇతరుల తథాస్థు (ఆమీన్) అంటూ ఒకరికొకరు అలయ్ బలయ్ (ఆలింగనాలు) చేసుకొని శుభాకాంక్షలు, ఆత్మీయ పలుకరింపులు లేకుండా పోయాయి.
ఇండ్ల వద్దే వేడుకలు జరుపుకోవాలి..
రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ముస్లింలు ఈద్గాల వద్దకు వెళ్లకుండా ఇండ్లల్లోనే ప్రత్యేక ప్రార్థనలు, వేడుకలు జరుపుకోవాలి. కొవిడ్ నిబంధనలు పాటించి సహకరించాలి. ఇప్పటికే లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల సదర్, నాయబ్ సదర్, ముస్లిం మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాం.
-అఖిల్ మహాజన్,ఏసీపీ మంచిర్యాల