బీజేపీకి టీఆర్ఎస్ మద్దతుతో లింగోజిగూడలో కొనసాగుతున్న ఉత్కంఠ
రెండవ రోజు మూడు నామినేషన్లు
నామినేషన్లు వేసిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు
ఎల్బీనగర్, ఏప్రిల్ 17 : ఎల్బీనగర్ సర్కిల్లోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికల ప్రక్రియ అనూహ్య మలుపులు తిరుగుతోంది. నామినేషన్ల ఘట్టం ఆరంభమైన వెంటనే ఊహించని రీతిలో టీఆర్ఎస్ మానవీయకోణంలో ఆలోచించి బరిలోంచి తప్పుకోవడంతో పాటుగా ఏకగ్రీవానికి మద్దతు పలుకడంతో ఒక్కసారిగా డివిజన్లో ఉత్కంఠత నెలకొన్నది. ఎల్బీనగర్ మున్సిపల్ మాజీ చైర్మన్, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ఆకుల రమేశ్గౌడ్ అకాల మరణంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆకుల రమేశ్ గౌడ్ తనయుడు ఆకుల అఖిల్ పవన్ గౌడ్ కుటుంబ సభ్యులతో పాటుగా బీజేపీ నాయకులు రాష్ట్ర మంత్రి కేటీఆర్ను కలిసి లింగోజిగూడ డివిజన్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కోరడంతో వెంటనే కేటీఆర్ సీఎం కేసీఆర్ అనుమతితో ఎన్నికల బరిలో టీఆర్ఎస్ ఉండబోదని ప్రకటించారు.
ఉప ఎన్నికల్లో అఖిల్ పవన్ గౌడ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా కాంగ్రెస్ కూడా బరిలోంచి తప్పుకోవాలంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డికి ఫోన్లో మంత్రి కేటీఆర్ మాట్లాడటంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మరోవైపు గత కొన్నిరోజులుగా విస్తృతంగా టీఆర్ఎస్ తరుఫున ప్రచారం చేసుకుంటున్న మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్రావుతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులను సముదాయించారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించాలని కూడా సూచించారు. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థిగా ఆకుల అఖిల్ పవన్ గౌడ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అందరూ భావించారు. సంతాప సభలో తాను పోటీలో ఉండబోమని ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థి దరిపల్లి రాజశేఖర్రెడ్డి పోటీల్లోంచి తప్పుకోనంటూ కొత్త అవతారం ఎత్తారు. ఈ మేరకు శనివారం సమావేశం నిర్వహించి పాదయాత్రలో ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయం చేరుకుని కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు. నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరి రోజు వరకు గడువు ఉండడంతో నామినేషన్ల ఉపసంహరణ వరకు డివిజన్ ఏకగ్రీవం అయ్యే అంశం ఇంకా సజీవంగా ఉంది.
లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల కోసం శనివారం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. బీజేపీ అభ్యర్థిగా ఆకుల అఖిల్ పవన్ గౌడ్ నామినేషన్ను దాఖ లు చేశారు. పవన్ నామినేషన్ ప్రక్రియలో కార్పొరేటర్లు వంగా మధుసూదన్రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా దరిపల్లి రాజశేఖర్రెడ్డి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఎల్బీనగర్ మజీద్గల్లికి చెందిన షేక్ పర్వీజ్ స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.