నిజామాబాద్ : అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తానని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బాన్సువాడ నియోజకవర్గం నసరుల్లాబాద్ మండలం నాచుపల్లి, మైలారం, నెమ్లి, బొమ్మన్ దేవపల్లి, నసరుల్లాబాద్ గ్రామాల్లో వడగండ్ల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి.
పంట నష్టపోయిన రైతులతో స్పీకర్ పోచారం హైదరాబాద్ నుంచి వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. కోతకు వచ్చిన పంటలు దెబ్బతినడంపై విచారం వ్యక్తం చేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
కరోనా ఉధృతి కారణంగా దెబ్బతిన్న పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించి రైతులతో మాట్లాడలేకపోతున్నానని తెలిపారు.
నాచుపల్లి గ్రామంలో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు స్పీకర్ దృష్టికి తెచ్చారు.
కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపి సీఎంతో మాట్లాడి ఇన్పుట్ సబ్సిడీ నుంచి ఎకరాకు రూ. 5400 అందేలా చూస్తానని స్పీకర్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి