నేటి నుంచి 45 ఏండ్లు పైబడిన వారికి టీకా
జిల్లాలోని 27 ప్రభుత్వ దవాఖానల్లో వ్యాక్సినేషన్
అన్ని పీహెచ్సీల్లో ఏర్పాట్లు పూర్తి
నిల్వ ఉంచేందుకు ఫ్రీజర్ల సౌకర్యం
రోజుకు రెండు వేల మందికి వ్యాక్సిన్
వికారాబాద్, మార్చి 31, (నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకున్నది. ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందించి ఏర్పాట్లు చేస్తుంది. టీకా వేయించుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. తొలుత 60 ఏండ్లు పైబడిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిబంధనలు రూపొందించింది. కొద్ది రోజుల తరువాత 45 ఏండ్లు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎలాంటి వ్యాధులూ లేకపోయినా 45 ఏండ్లు పైబడిన వారందరూ ఏప్రిల్ 1 నుంచి టీకా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 27 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు చేశారు.
ట్రయల్ రన్ నిర్వహణ..
వ్యాధులేమీ లేకుండా 45 ఏండ్లు పైబడిన వారందరికీ గురువారం నుంచి టీకా వేయనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించింది. పట్టణ, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా దవాఖానల్లో వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చేసింది. జిల్లాలో ఉన్న 22 పీహెచ్సీలు, 4 సీహెచ్సీలు, ఒక జిల్లా దవాఖాన ఉన్నది. జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్నాయి. బుధవారం ఒక్క రోజే 47 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికారులు విసృత్తంగా వైరస్ కట్టడికి చైతన్యం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ నారాయణతో కొంతమంది అధికారులు టీకా వేసుకుని స్ఫూర్తి, ధైర్యం నింపారు.
వ్యాక్సినేషన్ ఇలా..
ఏప్రిల్ 1 నుంచి ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయాలనే సంకల్పంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ సూచన మేరకు వారంలో నాలుగు రోజుల పాటు వేసే ఆలోచన ఉన్నది. పంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో కమిషనర్లు, పంచాయతీ సిబ్బంది, వైద్యాధికారులు సమన్వయంతో పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది. రోజుకు 2 వేల మందికి వ్యాక్సిన్ వేయడం లక్ష్యంగా నిర్దేశించారు. 45 నుంచి 59 ఏండ్ల వారు ఆధార్ కార్డు చూపితే చాలు. తొలి డోస్ వేసిన అనంతరం ఫోన్లో సంక్షిప్త సమాచారం అందగానే రెండో డోస్ కూడా పొందవచ్చు.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నేటి నుంచి 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకా వేయనున్నాం. జిల్లాలోని 27 ప్రభుత్వ దవాఖానల్లో వ్యాక్సిన్ ఇస్తారు. అన్ని పీహెచ్సీలలో ఏర్పాట్లు పూర్తి చేశాం.
-సుధాకర్షిండే, వైద్యాధికారి, వికారాబాద్ జిల్లా